చిల్లర రాజకీయాలొద్దు.. ఖేల్రత్న ముందు రాజీవ్ పేరు వుండాల్సిందే: మోడీకి రేవంత్ చురకలు
రాజీవ్ గాంధీ ఖేల్రత్నను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నగా మార్చడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును యథావిధిగా కొనసాగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు
దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్నను మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నగా మార్చడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును మార్చి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా నామకరణం చేయడం చాలా దారుణమన్నారు.
ఇది బీజేపీ, మోడీ సంకుచిత బుద్ధికి నిదర్శనమంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. యువకులను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన స్వర్గీయ రాజీవ్ గాంధీ పేరును ఖేల్ రత్నగా ఉండడం సముచితమని రేవంత్ పేర్కొన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును యథావిధిగా కొనసాగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని.. ఆయన చేసిన సేవలు మరువలేనివని టీపీసీసీ చీఫ్ ప్రశంసించారు.
Also Read:రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్పు: ఇక నుండి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న
కాగా, దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్రత్న అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఇక ఈ అవార్డును మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్నగా మార్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్లో ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి వచ్చిన వినతులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.