యూపీలో ఎంఐఎం పోటీపైనే కేసీఆర్- మోడీల చర్చ.. ఢిల్లీ టూర్లో సాధించిందేం లేదు : రేవంత్
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మధ్య ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల గురించి చర్చ జరిగిందని.. అక్కడ ఎంఐఎం ఎన్ని చోట్ల పోటీ చేయాలనే అంశంపై చర్చించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోడీ, కేసీఆర్ మిలాకత్కు బండి సంజయ్, ఈటల రాజేందర్ బలికాక తప్పదని రేవంత్ జోస్యం చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వారం రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఏం సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అంశాలపై ఏమైనా చర్చించారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో అమరవీరుల స్తూపానికి ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల గురించి చర్చ జరిగిందని.. అక్కడ ఎంఐఎం ఎన్ని చోట్ల పోటీ చేయాలనే అంశంపై చర్చించారని రేవంత్ ఆరోపించారు. మోడీ, కేసీఆర్ మిలాకత్కు బండి సంజయ్, ఈటల రాజేందర్ బలికాక తప్పదని రేవంత్ వ్యాఖ్యానించారు. సంజయ్, ఈటల ఎంత తిరిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి రాహుల్తో చర్చించినట్లు రేవంత్ వెల్లడించారు. తెలంగాణలో తరచూ పర్యటించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీని కోరినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9 నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.