బీహార్ రాష్ట్రానికి చెందిన అధికారులను కేసీఆర్ తన కోటరీగా ఏర్పాటు చేసుకొని అక్రమాలకు పాల్పడుతన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: అర్హత లేకున్నా Somesh Kumar తెలంగాణ సీఎం KCR రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీహార్ కు చెందిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కేసీఆర్ తన కోటరీగా పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
బుధవారం నాడు హైద్రాబాద్లో Revanth Reddy మీడియాతో మాట్లాడారు. Dharani పోర్టల్లో సమస్యల వల్ల హత్యలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్న హైద్రాబాద్ లో కర్ణంగూడలో జరిగిన హత్యలకు కూడా భూ వివాదాలే కారణమన్నారు. ధరణిని అడ్డు పెట్టుకొని హైద్రాబాద్ చుట్టుపక్కల భూ అక్రమాలు పెరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.పాత భూ యజమానులకు హక్కులు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఈ తరహా ఘటనలతోనే కర్ణంగూడ ఘటనలు చోటు చేసుకొంటున్నాయని ఆయన ఆరోపించారు. ధరణి పోర్టల్ ను అడ్డుపెట్టుకొని నిజాం నాటి భూముల్ని కబ్జా చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సోమేష్ కుమార్, Anjani Kumar లాంటి బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్లకు తెలంగాణలో కీలక పదవులు కేటాయిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కీలక శాఖల్లో బీహార్ రాష్ట్రానికి చెందినవారికే కట్టబెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 157 మంది IAS అధికారులలో ప్రతిభ ఉన్న అధికారులు లేరా అని ఆయన ప్రశ్నించారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, రజత్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా వంటి వాళ్ల వద్ద ఒక్కొక్కరి వద్ద నాలుగు నుండి ఐదు శాఖలున్నాయన్నారు. కానీ తెలంగాణకు చెందిన ఐఎఎస్లకు కనీసం శాఖలు కూడా కేటాయించడం లేదన్నారు.
ఎనిమిదేళ్ల పాటు సర్వీసులో లేని సోమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అర్హత లేకున్నా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిని సోమేష్ కుమార్ కు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులకే పెద్దపీట వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.1997 నుండి 1999 వరకు సోమేష్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి ప్రైవేట్ లో పనిచేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.2005 నుండి 2008 వరకు కూడా సోమేష్ కుమార్ ప్రైవేట్ కంపెనీలో పనిచేశారన్నారు. 2010 నుండి 2011 డిసెంబర్ వరకు కూడా ప్రైవేట్ లోనే సోమేష్ కుమార్ పనిచేశారని రేవంత్ రెడ్డి వివరించారు. సోమేష్ కుమార్ సర్వీసును లెక్క తీస్తే ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ మాత్రమే దక్కాలని రేవంత్ రెడ్డి చెప్పారు. అర్హత లేని వ్యక్తికి చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారన్నారు.
తనకు Chief Secretary పదవిని ఇచ్చినందుకు గాను సీఎం కేసీఆర్ చెప్పిన చోట సోమేష్ కుమార్ సంతకాలు పెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమేష్ కుమార్ రికార్డులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని తాను 2020 ఫిబ్రవరిలో ఆర్టీఐ ద్వారా అడిగితే సమాచారం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర విభజన సమయంలో డీఓపీటీ సోమేష్ కుమార్ ను ఏపీ కేడర్ కు కేటాయించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సోమేష్ కుమార్ కోర్టును ఆశ్రయించారన్నారు. అయితే court ఆదేశాలను DOPTఛాలెంజ్ చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. 2015లో కేసు వేసినా ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన ఫైల్ బెంచీ మీదకు రావడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఫైలు ఎందుకు బెంచీ మీదకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గానీ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ కానీ ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి అడిగారు.
