కృష్ణా నది  నీటి పంపకాల్లో తెలంగాణ ప్రభుత్వం జగన్ సర్కార్ తో కుమ్మక్కైందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కృష్ణా నది నీటి పంపకాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్  లొంగిపోయిందని ఆయన విమర్శించారు.


హైదరాబాద్: కృష్ణా నది నీటి పంపకాల్లో జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారా జగన్ కు కేసీఆర్ లొంగిపోయారా చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..గురువారం నాడు హైద్రాబాద్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేస్తున్న దగా మరోసారి నిరూపితమైందన్నారు. నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కేఆర్ఎంబీ సమావేశాలు రెండు దఫాలు తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడం వెనుక మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. కీలకమైన కేఆర్ఎంబీ సమావేశం జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో విందు భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 

నీటి పంపకాల కోసం పోరాటం చేసిన వాళ్లు 8 గంటలు కేఆర్ఎంబీ సమావేశం జరిగితే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు కృష్ణా నీటిలో దక్కాల్సిన 400 టీఎంసీల వాటా విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 

2015లో కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య జరిగిన ఒప్పందం గురించి ఆయన ప్రస్తావించారు. ఆ ఒప్పందం అని ఉన్నా కూడా ప్రతి ఏడాది ఎలా పొడిగించారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2020 మే 5న పోతిరెడ్డి పాడు ద్వారా 4 టీఎంసీల నుండి 8 టీఎంసీలకు పెంచారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

సంగంబండ నుండి రాయలసీమ లిఫ్ట్ ద్వారా 3 టీఎంసీలు తరలించేందుకు అనుమతిచ్చారన్నారు. ప్రతిరోజూ 11 టీఎంసీలు ఏపీకి తరలించేందుకు ప్రగతి భవన్ లోనే జీవో తయారు చేసి ఏపీకి కానుకగా ఇచ్చారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.