కేసీఆర్ పేరెత్తలేదు .. చూశారా , మోడీ మిత్ర ధర్మం : విజయ సంకల్ప సభపై రేవంత్ సెటైర్లు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కనీసం కేసీఆర్ పేరెత్తకుండా ప్రధాని నరేంద్ర మోడీ మిత్ర ధర్మం పాటించారంటూ రేవంత్ సెటైర్లు వేశారు.
బీజేపీ సభతో ప్రజలకు శబ్ధ కాలుష్యం తప్ప.. ప్రయోజనం ఏం లేదన్నారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన విజయ సంకల్ప సభపై (Vijaya Sankalpa Sabha) ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన శ్రీకాంతాచారి, జయశంకర్ ల ప్రస్తావన ఏదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూడేళ్లుగా కేసీఆర్ అవినీతిపై బీజేపీ నేతలు మాటలు చెప్పారని.. మోడీ (narendra modi) ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన నిలదీశారు. తెలంగాణ గడ్డపై వుండి విభజనను ఆనాడు అమిత్ షా తప్పు బట్టారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజలకు మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై మాట్లాడిన నేతలు.. చర్యలు ఎందుకు తీసుకోలేదని రేవంత్ ప్రశ్నించారు. అటు ‘‘తెలంగాణ మిత్రులారా .. తన చీకటి స్నేహితుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా.. కుటుంబ పాలన, అవినీతి ఊసెత్తకుండా ప్రధాని మోడీ మిత్ర ధర్మం చూశారుగా..!! అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
అంతకుముందు మంత్రి హరీశ్ రావు (harish rao) సైతం బీజేపీ సభపై స్పందించారు . ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేసిన ఆయన.. ‘‘ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధానమేదైనా ప్రకటిస్తారని ఆశించాం. కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప విధానమే లేదని తేల్చేశారు. కేసీఆర్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేదు సరికదా అసలు తమకు జవాబుదారీ తనమే లేదని నిరూపించారంటూ’’ హరీశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇకపోతే.. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగిసింది. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు ఏమాత్రం జవాబు ఇవ్వకుండా.. కనీసం రాజకీయ విమర్శల ఊసేత్తకుండా మోడీ ప్రసంగం సాగింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందాయి. హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు వచ్చిన వారందరికీ మోడీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని.. తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ అని ఆయన అన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో స్పూర్తిని ఇస్తోందని.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని మోడీ చెప్పారు. బడుగు , బలహీన వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు.
భద్రాచలం రాముల వారి ఆశీస్సులు మనకు వున్నాయని ప్రధాని తెలిపారు. తెలంగాణలో ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర పథకాలు అందుతున్నాయని మోడీ చెప్పారు. ఉచిత రేషన్ , ఉచిత వ్యాక్సిన్ అందించామని.. హైదరాబాద్ అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు. ఎనిమిదేళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నించామని మోడీ తెలిపారు.