సారాంశం
Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై నిరుద్యోగులు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బోర్డు నియమకాల్లో అనర్హులను నియమిస్తే అల్లకల్లోలం జరుగుతుందని, లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని తాను ముందే హెచ్చరించానని రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న లోపాల వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. టీఎస్పీఎస్సీ తప్పిదాల వల్లే గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందనీ, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం లేని ప్రభుత్వం అధికారంలోకి ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ నిర్వీర్యం అయిపోయిందని, ప్రభుత్వం పర్యవేక్షణ లోపం వల్లే అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు కురిపిస్తున్నారు.
కాగా.. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, పరీక్షలు కూడా సరిగా నిర్వహించడం చేతకాని ప్రభుత్వం ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని విమర్శించారు. టీఎస్పీఎస్సీ అనేది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని, రాజకీయ నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్లుగా నియమించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుమస్తా స్థాయి లేనివారు గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తే ఇలాంటి తప్పులే దొర్లుతాయని విమర్శించారు. ఈ నిర్లక్ష్యానికి ముమ్మాటికీ కేసీఆర్, కేటీఆర్లే కారణమని అన్నారు. పేపర్ లీకేజీలు, గ్రూప్-1 పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చిన టీఎస్పీఎస్సీను ఎందుకు సమీక్ష చేయడం లేదని సీఎం కేసీఆర్ ను రేవంత్ నిలదీశారు. ప్రభుత్వం తీరు వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి జీవితాలతో కేసీఆర్ సర్కార్ చెలగాటం ఆడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి.. దాని స్థానంలో మరో స్వతంత్ర బోర్టును నియమించాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగుల పరిస్థితిని సీఎం కేసీఆర్ అసలు పట్టించుకోవడం లేదని, వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారనీ, ప్రభుత్వాన్ని రద్దు చేస్తే అన్ని సమస్యలు తీరుతాయన్నారు. నిరుద్యోగుల పోరాటానికి కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని, గ్రూప్-1 మళ్లీ నిర్వహించడం వల్ల ఎన్నో ఏళ్లుగా కష్టపడి ప్రిపేర్ అయిన అభ్యర్థుల శ్రమ వృథా అయిందని అన్నారు. నిరుద్యోగుల తరుపున కాంగ్రెస్ పోరాటం చేస్తూ ఉంటుందని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉండమని భరోసా ఇచ్చారు రేవంత్.
వాస్తవానికి పేపర్ లీకేజీ ఉదాంతం వెలుగులోకి వచ్చినప్పుడే ప్రభుత్వం స్పందించి, టీఎస్పీఎస్సీని రద్దు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని, ప్రభుత్వంపై నిరుద్యోగులకు నమ్మకం పోయిందని అన్నారు. నియామకాలు చేపట్టాల్సిన బోర్డులోనే శాశ్వత నియామకాలు లేవని ఎద్దేవా చేశారు.