బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భేటీ అయ్యారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భేటీ అయ్యారు. బీజేపీ నేతల ఆహ్వానం మేరకే శంషాబాద్లోని నోవాటెల్ హోటల్కు వెళ్లిన నితిన్... నడ్దాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు కూడా వున్నారు. దీంతో వీరి భేటీపై తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అంతకుముందు శనివారం మధ్యాహ్నం నోవాటెల్ హోటల్లో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్తో జేపీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ పాల్గొన్నారు.
ఇకపోతే.. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ తనదైన యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు నాట బలమైన ఫ్యాన్ బేస్ వున్న సినీ తారలను మచ్చిక చేసుకునే పనిలో పడింది. దీనిలో భాగంగా ఇప్పటికే గత వారం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ కలయిక తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలకమైన మలుపుగా భావించవచ్చు. తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కు రాజ్యసభ సీటు ఇవ్వడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. తెలుగు సినీ ప్రముఖుల మద్దతు కూడా పొందేందుకు బిజెపి ప్రయత్నాలు సాగిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ ఇందులో భాగమేనని చెబుతున్నారు.
Also Read:అమిత్ షాతో జూ. ఎన్టీఆర్ భేటీ: ఆంధ్ర సెటిలర్ల ఓట్లకు గాలం
నిజానికి, ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యే విషయం బిజెపి తెలంగాణ నాయకులకు ముందుగా తెలియదు. అమిత్ షా కార్యక్రమాలు బిజెపి రాష్ట్ర నాయకులకు కొద్ది ముందుగానే తెలుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు మెచ్చి ఎన్టీఆర్ ను అమిత్ షా కలిశారని అంటున్నారు. అదే నిజమైతే అమిత్ షా రామ్ చరణ్ ను కూడా ఆహ్వానించి ఉండేవారనే మాట వినిపిస్తోంది. రాజకీయ ప్రయోజనం పొందడానికి మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన సమావేశమయ్యారని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఆ భేటీ జరిగి ఉండవచ్చు. అంతేకాకుండా టీడిపికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారు. 2009లో టీడిపి కోసం ఆయన ప్రచారం చేశారు. ఆ తర్వాత మొత్తం రాజకీయాలకే దూరమయ్యారు.
అయితే, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ ఎందుకయ్యారనేది ప్రశ్న. వీలైతే ఆయనను పార్టీలోకి తీసుకుని రావాలనే అమిత్ షా ఉద్దేశ్యమై ఉండవచ్చు. లేదా తమ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఎన్టీఆర్ ప్రభావితం చేయడం కూడా అయి ఉండవచ్చు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు గట్టి పోటీ ఇచ్చి వీలైతే అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్న బిజెపికి తెలంగాణలో అంధ్ర ఓటర్ల మద్దతు అవసరం. ముఖ్యంగా హైదరాబాదులోనూ దాని పరిసర ప్రాంతాల్లోనూ బిజెపికి మంచి పట్టు ఉంది. దానికి ఆంధ్ర ఓటర్ల మద్దతు తోడైతే బిజెపి అధిక శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంటుందనేది ఓ అంచనా. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు అందుకు ఉపయోగపడుతుందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అది బిజెపికి ఉపయోగపడుతుంది.
