బెల్టు షాపుతో తమ కడుపు కొట్టొద్దన్నందుకు 50 కల్లు గీత కుటుంబాలకు శిక్ష

గ్రామంలో బెల్టుషాపు వేలంపాటను అడ్డుకు న్నందుకు కల్లు గీత (గౌడ్) కులస్తులందరిమీద సాంఘిక బహిష్కరణ విధించిన సంఘటన కాటేపల్లి లోజరిగింది. యాదాద్రి జిల్లా మోటకొండూర్ మండలంలో ఈ ఊరు వుంది.

ఏడాదికోసారి ఈ గ్రామంలో ‘గ్రామాభివృద్ధి’ పేరిట అక్రమంగా మద్యం విక్రయిస్తారు. వేలం వేస్తారు. దానికోసం ఒక బెల్టు షాపు నడపుతారు. షాపు వేలంలో విక్రయిస్తారు. వేలం నిర్వహించేది సర్పంచు గారి శ్రీవారు.

 ఎక్కువ వేలం వేసిన వారు బెల్టు షాపును దక్కించుకొని అనధికారికంగా మద్యం విక్రయిస్తారు. వేలం పాట డబ్బులను (సర్పంచ్‌ భర్త) ఏనుగు నాగిరెడ్డికి చెల్లిస్తారు. ఇందులో అధికారులకు, ప్రజాప్రతినిధుల వాటాలు పోనూ మిగతావి గ్రామ దేవతల పండుగలకు ఖర్చు చేస్తారు. అయితే, ఈసారి బెల్టు షాపుల వేలంపాటులో తమ కుటుంబాలు పాల్గొనొద్దని కొన్ని కల్లు గీత కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే, వేసవిలో అక్రం బీరు మద్యం అమ్మితే కల్లు సేల్స్ పడిపోతాయి. తమకు ఉపాధి పోతుంది.

దీనితో ఆగ్రహించిన నాగిరెడ్డి,ఇది తనమాటను జవదాటటమే అంటూ, ఈ కుటుంబాలమీద సాంఘిక బహిష్కరణ విధిస్తున్నట్లు వూర్లో చాటింపువేయించాడు. శిక్ష ఈ రోజు నుంచి అమలయింది.

కాటేపల్లి గ్రామాంలో సుమారు 2500 జనాభా ఉంటుంది. వీరిలో కల్లు గీత వారు 50 కుటుంబాలుంటాయి.

‘నవతెలంగాణా’ దినపత్రిక కథనం ప్రకారం, ఈ కుటుంబాలకు చెందిన వారంతా ఓ సొసైటీగా ఏర్పడి కల్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఏడాదికోసారి గ్రామంలోని చెట్లను పంచుకుంటారు. ఆసాముల భూముల్లో ఉన్న చెట్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రుసుం చెల్లిస్తున్నారు.

అయితే. మద్యం అమ్మకాలతో తాటి కల్లు విక్రయాలు పడిపోయి జీవనోపాధి దెబ్బతింటుందన్న కారణంతో వారు బెల్టుషాపు వేలం బహిష్కరించాలనుకున్నారు.

గ్రామంలో బెల్టు షాపు వేలం నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నిజానికి తమ కులస్ధుడికే వేలం దక్కినా వారు దీనిని వ్యతిరేకించారు. ఇది నాగిరెడ్డికి ఏ మాత్రంనచ్చలేదు.

దీంతో రూ.70వేలకు బెల్టుషాపు దక్కించుకున్న శ్రీనివాస్‌ గౌడ్ పిలిపించి గ్రామంలో మద్యం అమ్మొద్దని, వేసవిలో కల్లు విక్రయాలకు అడ్డంకిగా మారకుండా చూడాలని నచ్చచెప్పారు.

దీనిని వూర్లో తన మాటకు ఎదురు చెప్పడం మొదలయినట్లుగా నాగిరెడ్డి తెగ ఫీలయ్యి, అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి పేద కల్లుగీత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు. ఈ కుటుంబాల కు శిక్ష వేసినట్లు డప్పు చాటింపు వేయించాడు.

ఇది శిక్ష : వాటర్‌ ప్లాంట్‌ వద్ద మంచి నీళ్లివ్వరాదు,. పాల సెంటర్‌ వద్ద పాలు ఇవ్వకూడదు. ఉత్పత్తి కేంద్రంలో వీళ్ల నుంచి పాల సేకరణ చేయరాదు. గ్రామ శివారులోని రైతుల వ్యవసాయ భూముల్లో ఉన్న తాటి చెట్లను ఎక్కనినీయవద్ద. వారితో మిగతా కులాలు మాట్లాడొద్దు. శుభ, అశుభ కార్యక్రమాల్లోవాళ్లని వెలివేయాలి.

ఇది అన్యాయం తమకు న్యాయం చేయాలంటూ రాయిగిరి- మోత్కూర్‌ రహదారిపై రెండు గంటలపాటు రాస్తా రోకో చేశారు.