ఫిబ్రవరిలో నిరుద్యోగ నిరసన ర్యాలీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోన్న టీ జేఏసీ
‘కారు’ జోరుకు బ్రేక్ లేసేందుకు తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ( టీ జేఏసీ ) రంగం సిద్ధం చేస్తోంది. ఒంటెత్తు పోకడలతో వెళుతున్న సర్కారు కు చెక్ పెట్టే దిశగా వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ వచ్చి రెండున్నరేళ్లు దాటినా సమైక్య పాలనలాగే పరిస్థితి ఉందన్నది టీ జేఏసీ అభిప్రాయం. అందుకే సమయం వచ్చినప్పుడల్లా టీ జేఏసీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ప్రాజెక్టుల రీ డిజైన్, ఎన్నికల హామీల అమలు, కొత్త జిల్లాల ఏర్పాటు, మల్లన్నసాగర్ భూ నిర్వాసితులు తదితర అంశాలపై ప్రతిపక్షాలకంటే టీ జేఏసీనే తన వాణిని బాగా వినిపిస్తోంది.
ఇటీవల రాష్ట్రం మొత్తంగా దాదాపు 3 వేల కిలోమీటర్లు పర్యటించి టీ జేఏసీని బలోపేతం చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు కూడా తీసుకున్నారు.
సోషల్ మీడియాను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని టీ జేఏసీ నేత ప్రొ.కోదండరాం తమ సభ్యులకు సూచించారు. దగ్గరుండి మరీ శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పిటికే టీ జేఏసీకి అనుబంధంగా ఓ వెబ్ సైట్ పనిచేస్తోంది. త్వరలో పత్రికను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంతేకాకుండా త్వరలో టీ జేఏసీ నేతృత్వంలో భారీ స్థాయిలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై చర్చించేందుకు టీ జేఏసీ రేపు నాంపల్లి లోని తన కార్యాలయంలో సమావేశం కూడా నిర్వహించనుంది. రేపటి సమావేశంలో "నిరుద్యోగ నిరసన ర్యాలీ" నిర్వహించే తేదీని కూడా ప్రకటిస్తారు.
అలాగే, రాష్ట్ర వ్యాపితంగా టీఙేయేసీ నాయకులను సమాచార సేకరణ పేరుతో ఇంటలిజెన్స్ పోలీసులు వేధిస్తున్న పరిణామాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటారు. మంగళవారంనాడు ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆ జిల్లా జేయేసీ నాయకులను ముందు జాగ్రత్త పేరిట అదుపులోకి తీసుకున్న విషయాన్ని స్టీరింగ్ కమిటీలో చర్చించనున్నారు.
