కామారెడ్డి జిల్లా పిట్లం సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే బైక్ పై ముగ్గురు యువకులు జాతీయ రహదారిపై వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న బైక్ కూడా తుక్కుతుక్కయ్యింది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన బందగి విజయ్, పాండురంగం, కల్హేర్ మండలం గాంధీనగర్ కు చెందిన సత్యం స్నేహితులు. ఈ ముగ్గురూ ఒకే బైక్ పై కామారెడ్డి జిల్లాకు పనిపై వెళ్లారు. ఈ క్రమంలోనే వీరు పిట్లం మండలం గద్దగుండు తండా వద్ద నేషనల్ హైవే 161పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయారు.
ఈ ముగ్గురూ హైవేపై వేగంగా వెళుతూ ఎదురుగా వస్తున్న లారీని డీకొట్టారు. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అనంతరం ఈ ఘోర ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో వున్నాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే మృతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
ఇదిలావుంటే నిన్న(ఆదివారం0 కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘోరమే చోటుచేసుకుంది. మద్యం మత్తులో డ్రైవర్ లారీ నడుపుతూ రాంగ్ రూట్ లో వచ్చి ముగ్గురిని బలితీసుకున్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు వృద్ద దంపతులతో పాలు కారు డ్రైవర్ మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం శివారులో రాజీవ్ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది.
కరీంనగర్ పట్టణానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకులు తాండ్ర పాపారావు(62), ఆయన భార్య పద్మ(56) ఓ అద్దెకారులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అదే జిల్లాలోని నాగుల మల్యాలకు చెందిన గొంటి ఆంజనేయులు(48) నడుపుతున్నారు. మల్లారం శివారులోకి రాగానే ఎదురుగా రాంగ్ రూట్లో వేగంగా వస్తున్న లారీ ముందు నుంచి కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి.
లారీ డ్రైవర్ కాళ్లూ, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటికి తీసి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా జూరాలకు చెందిన లారీ డ్రైవర్ శ్రీనివాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
