జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంబర్తి సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న డీసీఎంను కారు ఢీకొట్టింది. 

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న డీసీఎంను కారు ఢీకొట్టింది. ఈ ప్రమమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాలు.. డీసీఎం టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం వాహనం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆరేళ్ల చిన్నారి కూడా దుర్మణం చెందింది. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

ఇక, కారులో ఉన్నవారిని దేవేందర్ రెడ్డి, శ్రీవాణి దంపతులు, వారి ఆరేళ్ల కూతురుగా గుర్తించారు. వీరు తిరుమమల వెళ్లి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాజీపేటలో రైలు దిగి కారులో హైదరాబాద్‌ వైపు కారులో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు మృతిచెందిన డీసీఎం డ్రైవర్‌ను రాజశేఖర్, క్లీనర్‌ను మున్నాగా గుర్తించారు. వీరిద్దరు కూడా తిరుమలగిరి నుంచి ప్రజ్ఞాపూర్‌కు స్ట్రాప్ లోడ్‌తో వెళ్తుండగా.. డీసీఎం టైర్ పంక్చర్ అయింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.