ఈ ప్రపంచం మీదే... దానికి జయించండి: యువతకు మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు (వీడియో)
గురువారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఎస్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి దేశవ్యాప్తంగా 100మంది యువతతో జూమ్ ద్వారా మాట్లాడారు.
హైదరాబాద్: ఈ ప్రపంచం మీదే... దానిని జయించండి అని యువతకు పిలుపునిచ్చారు తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గురువారం అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిగిన ఎస్ సమ్మిట్ లో మంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 100మంది యువతతో జూమ్ ద్వారా సమావేశమై తన సందేశాన్ని అందించారు.
''ప్రస్తుతం ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరెంటు, పుష్కలమైన సాగునీటితో తెలంగాణలో వ్యవసాయ ముఖచిత్రం మారింది. యువత అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీల వైపు దృష్టి సారించాలి'' అని సూచించారు.
వీడియో
''మన వ్యవసాయ ఉత్పత్తులు మిగులు స్థాయికి చేరాయి. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలాగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానిని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు, వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతుల ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో మహిళా రైతులకు ప్రోత్సాహం అందిస్తాం'' అన్నారు.
''సింగిల్ విండో సిస్టం ద్వారా పరిశ్రమలకు లైసెన్స్ లు ఇవ్వడం మూలంగా టీఎస్ ఐపాస్ అద్భుతాలు సృష్టిస్తుంది. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ తో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా ప్రోత్సహిస్తాం'' అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.