పాలమూరు ప్రజలకు కేటిఆర్ శుభవార్త
- కేటిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన
- పాలమూరులో ఇదే తెలంగాణలో తొలి మెడికల్ కాలేజీ
పాలమూరు ప్రజలకు తెలంగాణ సర్కారు మరో తీపికబురు అందించింది. రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా సోమవారం మహబూబ్ నగర్ లో మెడికల్ కాలేజీ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే తొలి మెడికల్ కాలేజీ కావడం గమనార్హం.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి వైద్య కళాశాల మహబూబ్నగర్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపనకు ముహూర్తం కుదిరింది. రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో ఈ కళాశాల మంజూరైందని వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
నిజానికి రెండేళ్ళ కిందటే మహబూబ్నగర్ వైద్యకళాశాల ప్రారంభమైంది. 2016-17 విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తాజాగా 2017-18 సంవత్సరానికి కూడా అడ్మీషన్లు తీసుకున్నారు. ఏడాదికి 150 మంది చొప్పున 300 మంది వైద్యవిద్యార్థులు చదువుకుంటున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా అప్పట్లో జిల్లా కేంద్ర ప్రాంతీయ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా మార్చి, దాన్నే ప్రభుత్వ సాధారణ వైద్యశాలగా మెడికల్ కాలేజీకి అనుసంధానం చేసి టీచింగ్ హాస్పిటల్గా మార్చారు.
ప్రస్తుతం 350పడకల హాస్పిటల్గా పూర్తి స్థాయిలో పని చేస్తున్నది. కాగా, నూతన వైద్య కళాశాల కోసం జడ్చర్ల-మహబూబ్నగర్ దారి మధ్యలో ఉన్న ఎదిరలో 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఆ స్థలంలోనే మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ భవన సముదాయం శరవేగంగా నిర్మితమవుతున్నది. అందుకే అక్కడే శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరిగాయి.
మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేస్తుండగా, ముఖ్య అతిథులుగా వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విశిష్ట అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, పార్లమెంట్ సభ్యులు ఎపి జితేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎస్.రామచందర్రావు, కాటేపల్లి జనార్దన్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ళ దామోదర్రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, జిల్లా రోనాల్డ్ రోజ్, వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డైరెక్టర్ డాక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.