Asianet News TeluguAsianet News Telugu

హన్మకొండలో ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్‌లో చోరీ.. పారిపోతుండగా బావిలో పడ్డ దొంగ.. అసలేం జరిగిందంటే..?

తెలంగాణలోని హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్‌లో చోరీ జరిగింది. 

Thief falls into well after stealing from girls hostel in Hanamkonda district
Author
First Published Jan 22, 2023, 2:52 PM IST

తెలంగాణలోని హన్మకొండ జిల్లాలోని హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాల గర్ల్స్ హాస్టల్‌లో చోరీ జరిగింది. రాత్రిపూట హాస్టల్‌లోకి చొరబడి విద్యార్థినిల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను దొంగిలించిన దుండగుడు.. పారిపోయే క్రమంలో అతడు బావిలో పడిపోయాడు. దీంతో గతకొద్దిరోజులుగా హాస్టల్‌లో చోటుచేసుకుంటున్న చోరీ ఘటనల గుట్టు వీడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలోని బాలికల హాస్టల్‌లో దొంగతనానికి పాల్పడిన దొంగ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. దీంతో అతడు రాత్రి బావిలోనే గడపవలసి వచ్చింది. 

మరుసటి రోజు ఉదయం సహాయం కోసం అతడు బావిలో నుంచి కేకలు పెట్టాడు. ఆ కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకన్న పోలీసులు తాడు సహాయంతో అతడిని బయటకు తీశారు. హాస్టల్‌లో నాలుగు సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు దొంగిలించి తప్పించుకునే క్రమంలో బావిలో పడ్డానని ఆ వ్యక్తి అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తదుపరి విచారణలో హాస్టల్‌లో మూడు రోజుల్లో 14 సెల్‌ఫోన్లు, ఆరు ల్యాప్‌టాప్‌లు చోరీకి గురైనట్లు తేలింది.

హాస్టల్‌లోకి దొంగ ప్రవేశించడం, చోరీలు జరుగుతున్నా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థినిలు ఆందోళన  వ్యక్తం చేశారు. తమకు సరైన భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios