చిన జీయర్ స్వామి తమ ఆరాధ్య దైవాలను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ గిరిజన సంఘం మండిపడింది. ఈ మేరకు చినజీయర్ స్వామిపై ఆ సంఘం నాయకులు హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
సమ్మక్క, సారలక్క (Sammakka Saralakka)పై గతంలో ఎప్పుడో చేసిన కామెంట్స్ ఇప్పుడు చినజీయర్ స్వామి (Chinna Jeeyar Swamy) ని వెంబడిస్తున్నాయి. ఏ సందర్భంలోనే మాట్లాడిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు. అయితే చినజీయర్ స్వామికి తాజాగా మరో చిక్కువచ్చి పడింది. చినజీయర్ స్వామి తమ దైవం సమక్క, సారలక్కలను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ గిరిజన సంఘం పోలీసులను ఆశ్రయించింది.
తమ ఆరాధ్యదైవం అయిన సమ్మక్క సారక్క, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలపై త్రిదండి చిన జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారని తెలంగాణ గిరిజన సంఘం గురువారం చిక్కడపల్లి (Chikkadpally) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే చిన జీయర్ స్వామి కామెంట్స్ కు సంబంధించిన వీడియోలను పరిశీలించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్ తెలిపారు.
ఈ కేసుపై న్యాయపరమైన అభిప్రాయాన్ని కోరనున్నట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. కాగా తనపై వస్తున్న విమర్శలపై చినజీయర్ స్వామి స్పందించారు. శుక్రవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తాను 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటల పూర్వపరాలు తీసుకోకుండా మధ్యలో తమకు నచ్చినట్టుగా ఎడిటింగ్ (editing) చేసి సోషల్ మీడియా (social media) లో పోస్టు చేశారని ఆయన తెలిపారు. ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయన్నారు. ఈ మధ్య వచ్చిన ఆరోపణలు ఎలా వచ్చాయో వారి వివేకానికే వదిలేస్తున్నానని జీయర్ స్వామి చెప్పారు. కొందరిని చిన్నచూపు చూసే అలవాటు తమకు లేదని జీయర్ స్వామి తెలిపారు. ఒకళ్లని లేదా కొంతమంది దేవతల్ని చిన్న చూపు చూడడం అనేది పొరపాటు అన్నారు.
‘‘ ఎవరి పద్దతిలో వారుండాలి. మన పద్దతిలో మనం నడవాలని నమ్ముతాం. ఒక్క మాట విన్నప్పుడు దాని పూర్వపరాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. సొంత లాభాలకు ఈ వివాదాన్ని వాడుకోనే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. గ్రామ దేవతలను తాను తూలనాడినట్టుగా ప్రచారం సాగింది. అసలు తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే వారిపై జాలిపడాల్సి వస్తుంది. ఆదీవాసీల కోసం మేము అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అలాంటిది మేము వారి పట్ల చిన్నచూపుతో ఎలా మాట్లాడుతాం. మహిళలు పైకి ఎదగాలని కోరుకునే వాళ్లలో మేము ముందుంటాం ’’ అని చినజీయర్ స్వామి చెప్పారు.
‘‘ వన దేవతలకు వారి జ్జానం వల్ల ఆరాధ్య స్థానం వచ్చింది. మనుషలే వారి ఉన్నత గుణాల వల్ల ఉన్నతులుగా మారారు. దేనికైనా కొన్ని నియమాలు ఉంటాయి. ఒక పద్దతిలో వెళ్లాలనుకొనే వారికి కొన్ని పద్దతులు నియమాలుంటాయి. సంప్రదాయ దీక్ష చేసేవారికి మాంసాహరం తగదని చెప్పాను. హైద్రాబాద్ లో ఇటీవల సమతామూర్తి విగ్రహం ప్రతిష్టించాం. దీని గురించి దేశం మొత్తం గొప్పగా మాట్లాడుకుంది. ఇది సహించలేదని వారే ఈ వివాదానికి కారణమై ఉంటారు. పబ్లిసిటీ కోసం టీవీల ద్వారా అమాయక ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదు. ఇలా రెచ్చగొట్టడం చాలా సులభం’’ అని చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు.
