Rachabanda: తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.
Congress Rythu Bharosa Yatra: గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రజలకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ద్రోహం చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సరికొత్త డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్గాంధీ ఆవిష్కరించిన వరంగల్ డిక్లరేషన్పై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రచారంలో భాగంగా సోమవారం నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో రచ్చబండ/రైతు భరోసా యాత్ర సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ, తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీలు వారివారీ ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించుకుంటూ కొత్త డ్రామాకు తెరలేపాయని పేర్కొన్నారు. "బీజేపీ, టీఆర్ఎస్ రెండూ అధికార పార్టీలు.. నిజమైన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఉంది. అయితే, అధికారంలోని రెండు పార్టీలు ఇప్పుడు అధికారం పక్షంతో పాటు ప్రతిపక్షం పాత్ర కూడా పోషించాలని భావిస్తున్నాయి "అని అన్నారు.
‘‘వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల ప్రస్తావనను ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా దాటవేశారని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్కు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)ను ఎందుకు రద్దు చేశారనే దానిపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఖాతాలో రూ. 15 లక్షలు వంటి వాగ్దానాల పరిస్థితుల గురించి ఆయన కనీసం ఒక్క మాటైనా ప్రస్తావించి ఉండాల్సింది. టీఆర్ఎస్ నిర్దేశించిన స్క్రిప్ట్ను చదివి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
అలాగే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును వివరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ప్రతీకాత్మకంగా కొన్ని పథకాలను అమలు చేసి, అభివృద్ధిపై తప్పుడు ప్రకటనలు చేయడానికి వాటిని పోస్టర్లుగా ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. ఇందులో డబుల్ బెడ్ రూమ్ ల వంటివి ఉన్నాయని అన్నారు. “కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని పడగొడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. విచిత్రంగా కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై ప్రధాని మోడీ సైతం మౌనం వహించడం దేనికి సంకేతమని అన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లతో పాటు బీజేపీ-టీఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో చేస్తున్న ప్రసంగాలు ప్రజలను వాస్తవ సమస్యలను నుంచి దృష్టిని మళ్లించే విధంగా ఉన్నాయని అన్నారు. ఒక బూటకపు విమర్శలు, ఆరోపణలతో ప్రజల్లోకి కొత్త డ్రమాను తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. ఇవి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ-టీఆర్ఎస్ నేతలు వ్యూహాలని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు అంటూ ఆరోపించారు.
