తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై, ఆ పార్టీ నేతలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో ఆయన ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల పేరిట పచ్చబడ్డ పాలమూరు ను విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. ఆయన కౌన్సిలర్ స్థాయికి కూడా పనికిరాడని ధ్వజమెత్తారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలు ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు వస్తుంటే యాత్రలు మొదలయ్యాయని అన్నారు. బీజేపీ నాయకులు మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పుట్టుక దగ్గర నుంచే ఆ పార్టీ ఈ ప్రాంతం పై వివక్ష ప్రదర్శిస్తోందని చెప్పారు. 2000లో మూడు రాష్ట్రాలు ఇచ్చి న్నపుడే తెలంగాణ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. కొత్త రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు, సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి ఆ పార్టీ కట్టబెట్టిందని అన్నారు. అయినా సిగ్గు, శరం లేకుండా ఆ పార్టీ నేతలు గురువారం పాలమూరులో మాట్లాడారని చెప్పారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు సంస్కారం లేదని సీఎం, మంత్రులను పట్టుకుని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆరోపించారు. ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని అన్నారు. బండి సంజయ్ కౌన్సిలర్ స్థాయికి కూడా పనికి రాడని చెప్పారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. పాదయాత్రలో పేరిట బండి సంజయ్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆర్పించారు. కబ్జాలు చేస్తే జనం ఊరుకోరని అన్నారు. బీజేపీ చీఫ్ నడ్డా కాళేశ్వరం రూ. 20 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యేదని అంటున్నారని, కానీ ప్రపంచంలో ఎత్తయిన ఎత్తిపోతల పథకం కేవలం 20 వేల కోట్లతో పూర్తవుతుందా అని ప్రశ్నించారు. నడ్డాకు కనీస జ్ఞానం లేదని అన్నారు.
బీజేపీ కి వచ్చే ఎన్నికల్లో ఇపుడున్న సీట్లు కూడా రావని మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్యోష్యం చెప్పారు. బండి సంజయ్ కు అదృష్టం బాగుండి ఎంపీగా గెలిచారని అన్నారు. సంజయ్ తీరుని చూసి బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో దత్తాత్రేయ లాంటి నేతలు బీజేపీలో సంస్కార వంతంగా మెదిలారని అన్నారు. బీజేపీ కమీషన్ల పార్టీ అని ఎల్ఐసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మినప్పుడే రుజువైందని ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ పథకాలను కేంద్ర మంత్రులు పొగుడుతున్నారని, ఈ విషయం నడ్డాకు కనిపించడం లేదని అన్నారు.
పది సంవత్సరాల కిందట పేపర్లు చూస్తే తాను తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర పోషించానో తెలుస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ అంటే, సీఎం కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు అన్నా పంచ ప్రాణాలని అన్నారు. ఆయనను ఎవరూ ఓడించలేరని అన్నారు. పాలమూరు ఆకు పచ్చగా మారిందని, వలసలు వాపస్ అయ్యాయని, ఈ విషయం బీజేపీ నాయకులకు కనిపించడం లేదని ప్రశ్నించారు. గత రెండు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటికీ అతీగతి లేదని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి మట్లాడారు. బండి సంజయ్ పాదయాత్ర లో ఇష్టమొచ్చినట్టుగా అరుస్తున్నాడని అన్నారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా పాదయాత్రలో వేరే జిల్లాలో వారే అధికంగా ఉన్నారని తెలిపారు. పాదయాత్ర సాగిన 22 రోజుల్లో ఎక్కడా అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. మొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం గురించి పొగిడారని, కానీ నిన్న నడ్డా విమర్శించారని తెలిపారు. 20 రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయని, అక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా కోసం బీజేపీ నేతలు ఢిల్లీ కి మోకాలి యాత్ర చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ బీజేపీ నేతలు తెలంగాణ పై కక్ష గట్టారని ఆరోపించారు. రాష్ట్రం కోసం బీజేపీ ఒక్క పని అయినా చేసిందా అని ప్రశ్నించారు. మంచి పనులు చేయాలని, పిచ్చి పనులు మానుకోవాలని సూచించారు. యూపీలో అభివృద్ధి ఎలా ఉందని, అలాగే తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో చూసుకోవాని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ నేతలు కేసీఆర్ కాలిగోటి కి కూడా సరిపోరని అన్నారు. .మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై సంజయ్ ఆరోపణలు అర్థరహితమని అన్నారు. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
