తెలంగాణా యువత ప్రశ్నలివి
ప్రభుత్వం చెప్పే ఉద్యోగాల లెక్కలన్నీ తప్పులని ఆందోళనకు సిద్ధమవుతున్న యువకులంటున్నారు
టీ.ఆర్.ఎస్ ఇచ్చిన హామీ 5 ఏళ్ళలో లక్ష ఉద్యోగాలనీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు 24,912 అనీ, త్వరలో 17,581 ఇవ్వనున్నారనీ, ఇప్పటికే 20000 మండి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగి పోయిందనీ, ప్రటిస్తున్నది. ఇప్పటికే 45000 ఉద్యోగాలు ఇచ్చామనీ, ఇంకా 17581 ఊద్యోగాలు త్వరలో వస్తాయనీ ప్రభుత్వం చెబుతుంది.
ఈ సందర్భంగా ఉద్యోగాలకోసం ఉద్యమించాలనుకుంటున్న తెలంగాణా యువత లేవదీస్తున్న విషయాలు ఇవి:
- నవంబరు24, 2014 నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ కొన్ని మాసాలలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇది కాక రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తున్నాట్టు ప్రకటించారు. అంటే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, మరో లక్షకు పైగా కాంట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, అంటే మొత్తం 2-2.5 లక్షల నియామకాలు ఇప్పటికే జరగాలి. ఇప్పటికే మాసాలు కాదు, రెండేళ్ళు పూర్తయ్యాయి. ప్రభుత్వంలోని 20000 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ జరిగిపోయిందని చెప్పటం శుద్ద అబద్దం. ప్రభుత్వంలో ఒక్కరి క్రమబద్దీకరణ కూడా జరగలేదు.
- మిగిలిన 24912 అని చెబుతున్నవన్నీ కొత్త ఉద్యోగాలు కావు. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించింది సుమారు 4675 (ఎలక్ట్రికిటీ సంస్థలో 1175 కాంట్రాక్టు జేఎల్ఎంలను, ఆర్టీసీ లలో ఉన్నసుమారు 3500 డ్రైవర్లు,కండక్టర్లు). వీటిని కూడా కొత్త ఉద్యోగాలుగా ప్రకటించుకుంటుంది. ఆర్టీసీలో చిన్న చిన్న కారణాలు చూపెట్టి వందలాది డ్రైవర్లను, హౌసింగ్ కార్పోరేషన్ను మూసివేయడం ద్వారా, ఇంకా అనేక సంస్థలలో వందలాది కాంట్రాక్టు కార్మికులను చిన్న చిన్న కారణాలు చెప్పి తొలగించారు. అంటే క్రమబద్దీకరించిన కార్మికులు, తొలగించిన కార్మికుల సంఖ్య దాదాపు సమానం. 3
- మిగిలిన ఉద్యోగాలలో కూడా వాస్తవ నియామకం జరిగింది చాలా తక్కువ. ఉదాహరణకు విద్యుత్ సంస్థలలో ప్రభుత్వం చెబుతున్నా లెక్క 1170, కానీ వాస్తవంగా తీసుకున్నది 950 మాత్రమే. అంటే తెలంగాణ జేఏసీ చెప్పిన లెక్కనే వాస్తవమని తెలుస్తుంది ( పోలీసు కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు 10-15వేలు, ఇతర నియామకాలు 4295, మొత్తం 15 నుండి 19 వేలు మాత్రమే.
ఇవీ వాస్తవాలు. ఇప్పటికైనా ప్రభుత్వం తప్పుడు ప్రచారం మానుకోవాలని ఇంకా తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించడం సాధ్యం కాదని తెలుసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ యువతకు బాసటగా నిలవాలి. ఉద్యోగాల కల్పనలో చిత్త శుద్దిగా ముందుకు సాగుతూ ఫిబ్రవరి 22 ర్యాలీ లో పాల్గొనాలని వారు పిలుపునిస్తున్నారు.