Koppula Eshwar: 'కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ పచ్చి బూటకం.. వారికి ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు'
Koppula Eshwar: కాంగ్రెస్ పార్టీకి ఓట్ల మీద తప్ప దళితుల మీద ప్రేమ లేదని, ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ నాటకమడుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈ డిక్లరేషన్ ను తెలంగాణ లో కాదనీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ డిక్లరేషన్ విడుదల చేయాలని మల్లిఖార్జున్ ఖర్గే కు సవాలు విసిరారు.
Koppula Eshwar: ఎన్నికలకు ముందు దళితులను ,గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందనీ, దళితుల మీద ప్రేమ ఉంటే ఈ డిక్లరేషన్ ను తెలంగాణలో కాకుండా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు.
బిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దేశంలో 40 కోట్ల మందికి పైగా దళిత ,గిరిజనులు ఉన్నారనీ, 50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఏనాడు కూడా దళిత ,గిరిజనులను గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ దళితులను, గిరిజనులను మోసం చేసిందనీ, వంచించి ఓట్లు వేయించుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులయ్యారని అన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ను ఎవ్వరూ నమ్మేలా లేదనీ, ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదని నిలదీశారు.
కాంగ్రెస్ హాయంలో దళిత గిరిజన విద్యార్థుల కోసం ఇన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలు పెట్టారా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం మొత్తం 1006 రెసిడెన్షియల్ స్కూళ్లలను ఏర్పాటు చేసిందనీ, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దళిత గిరిజనులకు అడ్మిషన్లు దొరుకుతున్నాయంటే అది రెసిడెన్షియల్ విద్య ఫలితమేనని మంత్రి గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం ఎందుకు లేదనీ, కేసీఆర్ తరహాలో దళిత బంధు పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచించలేదని మంత్రి ప్రశ్నించారు. దళితులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ నేతలు దళిత గిరిజనులకు డిక్లరేషన్ విడుదల చేస్తారని ఎద్దేవా చేశారు.
దళితబంధు కోసం 12 లక్షల రూపాయలు కాదు కాంగ్రెస్ కు దమ్ముంటే తమ పాలిత రాష్ట్రాల్లో ఐదు లక్షలు ఇవ్వండని సవాల్ విసిరారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే తెలంగాణ లో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని మంత్రి ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదనీ, దళిత గిరిజనులకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆపద మొక్కులను ఎవ్వరూ నమ్మరని విమర్శించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు మెరుగులు దిద్ది ఎదో చేస్తామని కాంగ్రెస్ భ్రమలు కల్పిస్తోందనీ, తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని దీమా వ్యక్తం చేశారు. మరింత సమర్ధంగా పథకాలు అమలు చేస్తామనీ, ఎనిమిదేళ్లలో దళితబంధు అన్నీ దళిత కుటుంబాలకు అందుతుందని తెలిపారు.
60 ఏళ్ళు ఓపిక పట్టిన దళిత సోదరులు మరో ఎనిమిదేళ్లు ఓపిక పడతారనీ, కాంగ్రెస్ మాయ మాటలు ఎవరూ నమ్మరని, కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకమని విమర్శించారు. దళిత బంధు లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అనేది దుష్ప్రచారం మాత్రమేననీ, ఎన్నికలు ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, 115 మంది అభ్యర్థులతో తాము జాబితా విడుదల చేసుకోవడం ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనమని అన్నారు.