మహాలక్ష్మి పథకానికి విశేష ఆదరణ.. ఇప్పటివరకు ఎన్ని కోట్లమంది ఉచితంగా ప్రయాణించారంటే?
హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం(జనవరి 03) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు.
![Telangana TSRTC informs 6.50 cr women traveled for free so far Krj Telangana TSRTC informs 6.50 cr women traveled for free so far Krj](https://static-ai.asianetnews.com/images/01hhahh7aatwgdc0bgrjj6zf90/ga1lu0cayaa7nfw-jpg_363x203xt.jpg)
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి ( ఫ్రీజర్నీ) విశేష ఆదరణ వచ్చింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి 6.50 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) వెల్లడించింది. రోజుకు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా రోజుకు రూ.10 కోట్ల విలువైన జీరో టిక్కెట్లు జారీ అవుతున్నాయని అధికారులు తెలిపారు.
బుధవారం నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి సంస్థ ఉన్నతాధికారులు వివరించారు.
అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన అధికారులను అభినందించారు. ఆర్థిక శాఖ నుండి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. టిఎస్ఆర్టిసిని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు అవసరమని నొక్కిచెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్, లాజిస్టిక్స్, వాణిజ్య ,ఇతర టిక్కెట్యేతర ఆదాయం వంటి రంగాలపై దృష్టి సారించి, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
సిబ్బంది బకాయిలు, కంపెనీ అప్పులు, ప్రావిడెంట్ ఫండ్లు (పిఎఫ్లు), ఇతర సెటిల్మెంట్లకు సంబంధించి టిఎస్ఆర్టిసికి నిధులను అందించడానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. ఈ పథకాన్ని ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.