టీలో చంద్రబాబు వ్యూహం రెడీ: కాంగ్రెసుతో పొత్తుపై నారా లోకేష్
ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు బలంగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వ్యూహరచనకు సిద్ధపడ్డారు. వారు బుధవారం హైదరాబాదులో సమావేశమయ్యారు.
హైదరాబాద్: ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు బలంగా వస్తున్న నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వ్యూహరచనకు సిద్ధపడ్డారు. వారు బుధవారం హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదు రానున్నారు.
ఆయన ఆ రోజు తెలంగాణ టీడీపి నేతలతో సమావేశమవుతున్నారు. తన వ్యూహాన్ని వారికి వివరించి, దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహంపై మాత్రమే కాకుండా పొత్తులపై కూడా చంద్రబాబు స్పష్టత ఇస్తారు.
కాగా, తెలంగాణలో టీడీపి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెర దించారు. తెలంగాణలోని 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తులపై పార్టీ పొలిట్బ్యూరో తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు తెలంగాణలో నాయకులు టీడీపీని వీడినా కార్యకర్తలు అలాగే ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఎప్పుడైనా హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం పెడితే కనీసం ఐదువేల మంది వస్తున్నారని, పార్టీ కార్యాలయం సరిపోవడం లేదుని, ప్రతి గ్రామంలోనూ బలమైన కార్యకర్తలున్నారని ఆయన అన్నారు.