తెలుగురాష్ట్రాల నుండి ఒకేఒక్కడు... జాతీయ అవార్డు గ్రహీతకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసలు
జాతీయ స్థాయి అవార్డు అందుకున్న తెలంగాణ పరిశోదన విద్యార్థి మహ్మద్ ఆజమ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.
జాతీయ ఉత్తమ యువజన అవార్డు అందుకున్న కేయూ పరిశోధన విద్యార్థి, సామాజిక కార్యకర్త మహ్మద్ ఆజమ్ ను రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చిన ఆజమ్ కు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా తనకు కేంద్రం అందించిన మెడల్ తో పాటు ప్రశంసాపత్రాన్ని మంత్రికి చూపించాడు ఆజమ్.
భారత ప్రభుత్వం కేంద్ర క్రీడల, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతియేటా సామాజిక సేవారంగంలో విశిష్ట సేవలందించే 18-29 వయస్సుగల యువతకు ఇచ్చే అత్యున్నత పురస్కారం జాతీయ ఉత్తమ యువజన అవార్డు. 2017-18 సంవత్సరానికి గాను తెలంగాణకు చెందిన కాకతీయ విశ్వవిద్యాలయ ఆంగ్లవిభాగ పరిశోధన విద్యార్థి, సామాజిక కార్యకర్త మహ్మద్ ఆజమ్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. తాజాగా అవార్డు అందుకున్న ఆజమ్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. 2017-18 గాను ఈ అవార్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్ ఆజమ్ ఒక్కరే ఎంపిక కావడం విశేషమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ఈ అవార్డును మహ్మద్ అజమ్ ఆగస్ట్ 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడల యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డు తో పాటు ప్రశంస పత్రం, సర్టిఫికెట్ తో పాటు 50వేల నగదు బహుమతిని కేంద్ర క్రీడల, యువజనుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరుపున అందుకున్నట్లు అజామ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి వివరించారు.