11 నుండి ఆరు పేపర్లకు కుదింపు: టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. 11 పేపర్ల నుండి ఆరు పేపర్లకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: 2021-22 టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లను ఆరు పేపర్లకే కుదిస్తూ telangana government నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.2020-21 విద్యాసంవత్సరం పరీక్షలకు కూడ ఆరు పేపర్లకు కుదించారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.
also read:ఏపీ ఎస్ఎస్సీ బోర్డులో లైంగిక వేధింపులు: 20 రోజులుగా మహిళా ఉద్యోగినుల ఆందోళన
గతంలో టెన్త్ లో11 పేపర్లు ఉండేవి. అయితే తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో ఆరు పేపర్లను మాత్రమే విద్యార్ధులు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, జనరల్ సైన్స్ (ఫిజిక్స్, బయాలజీ)సోషల్ స్టడీస్ కు చెందిన పేపర్ -1, పేపర్ 2 లు ఒకే పేపర్ గా ఉండనున్నాయి. అయితే సెకండ్ లాంగ్వేజ్ లో ఏ విధమైన మార్పులు ఉండవు.
ఇంగ్లీష్, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు ఒకే పరీక్ష ఉండేలా మార్పులు చేసింది. సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరుగా సమాధాన పత్రాలుండేలా ప్రభుత్వం మార్పులు చేసింది.
ఒక్కో పేపర్లో 80 మార్కులుంటాయి. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా నిర్వహించనున్నారు. గతంలో పరీక్ష రాసేందుకు రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మరో అరగంట సమయం పెంచారు. అంటే ఒక్కో పేపర్ రాయడానికి మూడు గంటల పదిహేను నిమిషాల సమయం కేటాయించారు.70 శాతం సిలబస్ నుండే ప్రశ్నలు రానున్నాయి.
2020-21 విద్యా సంవత్సరంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్ధులకు ఈ నెల 25 నుండి ఫస్టియర్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది.
కరోనా థర్డ్ వేవ్ కారణంగా సెకండియర్ పరీక్షలను నిర్వహించలేని పరిస్థితులు నెలకొంటే ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ విద్యార్ధులను ప్రమోట్ చేసి మార్కులను కేటాయించాలని సర్కార్ భావిస్తోంది.