సైకిల్ పై తెలంగాణ స్పీకర్ షికారు (వీడియో)
తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి హైదరాబాద్ నుంచి కాలు బయటపెడితే చాలు ఆయన ఏం చేస్తారో ఎవరికీ అంతు చిక్కదు. ఇటీవల కాలంలో ఆయన హైదరాబాద్ లో కంటే ఎక్కువగా తన సొంత నియోజకవర్గం భూపాలపల్లిలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. పల్లె నిద్ర పేరుతో భూపాలపల్లిలో ప్రతి గ్రామంలో రాత్రిపూట మకాం వేస్తున్నారు.
ఇక గ్రామాల్లో స్పీకర్ పర్యటనలు, ఆయన జనాల్లో తిరుగుతున్న తీరుతో అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా శాయం పెట్ మండలం నరసింహుల పల్లె లో గురువారం రాత్రి ప్రగతి నిద్ర చేసిన స్పీకర్ మధుసూదనా చారి ఉదయమే గ్రామస్తుల తో సమావేశం అయ్యారు. ప్రజా సమస్యల చర్చించిన అనంతరం గ్రామ పరిసర ప్రాంతాలను తిరిగి చూసారు. రోడ్ వెంట ఉన్న చెట్లు, ముళ్ల పొదలను తొలగించాలని వారికి సూచించారు. రోడ్ కు ఇరువైపుల చెట్లను నాటితే వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా స్పీకర్ సైకిల్ పై వెళుతున్న గ్రామస్తుడి తో కాసేపు మాట్లాడి ఆయన సైకిల్ తీసుకుని తొక్కారు. గ్రామ పొలిమేర వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర సైకిల్ మీద వెళ్లి గ్రామాన్ని పరిశీలించారు.