రెవిన్యూ వృద్ధిరేటు 6.3 శాతానికి తగ్గుదల: హరీష్ రావు
రాష్ట్ర రెవిన్యూ వృద్ధి రేటు గతంతో పోలిస్తే తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
హైదరాబాద్: రాష్ట్ర రెవిన్యూ వృద్ధి రేటు గతంతో పోలిస్తే తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
భారతదేశ ఆర్ధిక వృద్ధి రేటు గత ఏడాది నుండి తగ్గుతూ వస్తోంది దీంతో కేంద్ర ఆదాయ వనరులు కూడ తగ్గడంతో రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాలోనూ, గ్రాంట్లలోనూ కోత పడినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
2019-20 ఆర్ధిక సంవత్సరానికి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, బడ్జెట్లో వేసుకొన్న అంచనాల కంటే రూ. 3,731 కోట్లు తగ్గిందని మంత్రి హరీష్ రావు చెప్పారు.
రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన ఐజీఎస్టీలో కానీ, జీఎస్టీ పరిహరంలో కానీ నిధులు సకాలంలో రావడం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం నుండి వస్తున్న నిధులు కూడ అరకొరగానే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణాలన్నింటి వల్ల రాష్ట్ర రెవిన్యూ వృద్ధి రేటు 2018-19 లో 16.1 శాతం ఉంటే అది 2019-20 ఫిబ్రవరి చివరి నాటికి 6. 3 శాతానికి తగ్గిందని ప్రభుత్వం ప్రకటించింది.
15వ, ఆర్ధిక సంఘం మధ్యంతర నివేదిక ప్రకారంగా తెలంగాణకు వచ్చే పన్నుల వాటా 2.437 శాతం నుండి 2.133 శాతానికి తగ్గింది. దీంతో 2020-21లో ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ. 2,384 కోట్లు తగ్గాయన్నారు.
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సరైన వ్యూహాలను రూపొందించి, అభివృద్ధి దిశగా పురోగమించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ఆయన ప్రకటించారు.
Also read:తెలంగాణ బడ్జెట్ 2020: రైతు రుణాలు ఏక కాలంలో మాఫీ
2019-20 పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాల మేరకు ఈ మార్చి నెలాఖరుకు రూ. 1,36, 000 కోట్ల రూపాయాలు ఖర్చు చేయడం జరుగుతోందని హరీష్ రావు తేల్చి చెప్పారు.కేంద్రం నుండి పన్నుల వాటా, గ్రాంట్లలో కోతపడినప్పటికీ ఆ లోటును స్వీయ ఆదాయ వృద్ధి ద్వారా పూడ్చుకోగలిగినట్టుగా చెప్పారు.బడ్జెట్ అంచనాల మేరకు ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలిపారు.