లోక్సభలో రేవంత్ కొత్త సంప్రదాయం: మొబైల్లో చూస్తూ ప్రమాణం
మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సభా సంప్రదాయాలకు భిన్నంగా ప్రమాణం చేశారు. లోక్సభ అధికారులు ఇచ్చిన ప్రమాణ పత్రాన్ని తిరస్కరించారు. ఆయన తన మొబైల్లో ప్రమాణ పత్రాన్ని చూస్తూ తెలుగులో ప్రమాణం చేశారు.
లోక్సభలో కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాల కార్యక్రమం కొనసాగుతోంది. ఆంగ్ల అక్షర క్రమంలో భాగంగా లోక్సభ సమావేశాల రెండో రోజు తెలంగాణకు అవకాశం వచ్చింది. అయితే మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సభా సంప్రదాయాలకు భిన్నంగా ప్రమాణం చేశారు.
లోక్సభ అధికారులు ఇచ్చిన ప్రమాణ పత్రాన్ని తిరస్కరించారు. ఆయన తన మొబైల్లో ప్రమాణ పత్రాన్ని చూస్తూ తెలుగులో ప్రమాణం చేశారు. తెలంగాణ ఎంపీల్లో తొలుత ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబు రావు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు ప్రమాణం చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, పోతగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు తదితరులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేసే సమయంలో వారి వెనుకే కూర్చొన్న హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బల్ల చరిచి అభినందించారు. హైదరాబాద్ ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేస్తున్న సమయంలో సభ్యులు వందేమాతరం, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడంతో లోక్సభ మారుమోగింది.