నాలాలపై అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాం: తలసాని
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తామని తెలంగాన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేస్తామని తెలంగాన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం నాడు ఆయన మంత్రి మహమూద్ అలీతో కలిసి జీహెచ్ఎంసీలో వర్షా కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని నాలాలపై అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. 1360 కి.మీ. మేర రూ. 45 కోట్లతో నాలాల్లో పూడిక తీత తీస్తున్నామన్నారు. పూడికతీత కోసం త్వరలోనే యంత్రాలను సమకూర్చుతామని ఆయన చెప్పారు. చెరువుల ఆక్రమణలను కూడ తొలగిస్తామని ఆయన చెప్పారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు తీసుకొంటామని మంత్రి వివరించారు. ఎల్బీనగర్, ఉఫ్పల్ రింగ్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను నివారించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో జీహెచ్ఎంసీలో నాళాలలో పూడిక తీతతో పాటు అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కేంద్రీకరించింది. వర్షాకాలంలో నాళాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.