కృష్ణా జలాలు దోపిడి, వైఎస్ లాగే జగన్, భయపడేది లేదు: పువ్వాడ అజయ్ ఘాటు వ్యాఖ్యలు
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామన్నారు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఇప్పటికే కేంద్రానికి మా అభ్యంతరం తెలియజేశామని వెల్లడించారు. అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని.. మీ ఇష్టం వచ్చినట్టు శ్రీశైలం దగ్గర బొక్క కొట్టి కృష్ణా జలాలు దోచుకుంటుంటే ఊరుకునే ప్రశక్తేలేదని అజయ్ కుమార్ స్పష్టం చేశారు
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇటు తెలంగాణ మంత్రులు.. అటు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ప్రతినిత్యం మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఖమ్మంలోని అడవి మల్లేలలో ఆదివారం ‘పల్లె ప్రగతి’ సభలో పాల్గొన్న అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాజశేఖర రెడ్డి ఆనాడు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాడు.. నేడు ఆయన కొడుకు కూడా అదే పని చేస్తున్నాడని ఆరోపించారు. కృష్ణా జలాలు దోచుకుంటున్న దొంగని దొంగ అనే అంటామని.. జగన్కు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామన్న ఆయన.. ఇప్పటికే కేంద్రానికి మా అభ్యంతరం తెలియజేశామని వెల్లడించారు.
Also Read:టెన్షన్: బోటులో పులిచింతలకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయబాను
అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని.. మీ ఇష్టం వచ్చినట్టు శ్రీశైలం దగ్గర బొక్క కొట్టి కృష్ణా జలాలు దోచుకుంటుంటే ఊరుకునే ప్రశక్తేలేదని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తామేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని.. తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కోసం ఎంతదూరమైనా వెళతామని, ఎవరితోనైనా కొట్లాడతామని అజయ్ కుమార్ అన్నారు. తమ హక్కుల కోసం మా వాటా కోసం అవసరమైతే దేవునితో అయినా కొట్లాడతామని కేటీఆర్ చెప్పిన విషయం మర్చిపోవద్దు అని పువ్వాడ హెచ్చరించారు.