సమ్మె వాయిదా వేయండి : మంత్రి పట్నం బుజ్జగింపులు
సచివాలయంలో భేటీ
ఆర్టీసిలో ఈనెల 11 నుంచి తలపెట్టిన సమ్మె వాయిదా వేయాలని కోరారు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. ఆర్టీసి కార్మిక సంఘాలను సచివాలయంలో చర్చలకు ఆహ్వానించారు మంత్రి. శుక్రవారం సచివాలయంలో కార్మిక సంఘాలతో జరిపిన సమావేశంలో ఈమేరకు మంత్రి కార్మిక నేతలను కోరారు. ఈ చర్చల్లో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు పాల్గొన్నారు. కార్మిక సంఘాల తరుపున రాజీరెడ్డి(ఈయూ),హన్మంతు (టీజేఎంయూ),వీఎస్ రావు(SWF), అబ్రహాం(INTUC), రమేష్ కుమార్ (BMS), యాదయ్య.బీ(TNTUC), ఎస్. సురేష్ (BWL), యాదగిరి (Bku) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నష్టాలు,కష్టాల ఆర్టీసీ ని సమిష్టి కృషితో ముందడుగు వేయిద్దామని ప్రతిపాదించారు. ఈనెల 11 నుంచి ప్రారంచించే సమ్మె మీద పునరాలోచించుకుని, విరమించుకోండి అని సూచించారు. సీఎం కేసీఆర్ తో చర్చించి త్వరలో ప్రత్యేక కమిటీ వేసుకుని ఇతర రాష్ట్రాలలో ఉన్న పరిస్థితి ని అధ్యయనం చేసుకుని ముందడుగు వేద్దామని సూచించారు. అక్రమ రవాణా మీద ఎప్పుడూ సీరియస్ గానే ఉన్నామని చెప్పారు. గతంలో ఎన్నడూలేని విధంగా నాలుగేళ్ళ లో అక్రమ రవాణా మీద కేసులు నమోదు చేశామన్నారు.