హైదరాబాద్‌ పరిధిలోని కైతలాపూర్‌ పరిధిలోని ఫ్లై ఓవర్‌ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌ పరిధిలోని కైతలాపూర్‌ పరిధిలోని ఫ్లై ఓవర్‌ను మంత్రి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్‌డీపీ కింద రూ. 8052 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇంకా 17 వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వాటిలో ఈ ఏడాది ఆరు, మిగిలిన వాటిని వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్నయాని తెలిపారు. రూ. 3117 కోట్లతో రెండో దశ ఎస్ఆర్‌డీపీ మొదలు పెడతామన్నారు. 

హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. ‘‘కూకట్‌పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని... ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే కాకుండా కేసులు పెడతా అంటున్నారు. ఐడీపీఎల్ కోసం రాష్ట్ర ప్రబుత్వం భారీగా భూములు ఇచ్చింది. కేంద్ర మంత్రిగా మీరు కొత్తగా పైసా పని చేయరు.. మేము పని చేస్తుంటే కేసులు పెట్టమని ఆదేశాలు ఇస్తున్నారట. మీకు దమ్ముంటే.. నాపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన కేసు పెట్టండి. ఇంజినీర్ల మీద, కింద పని చేసే కార్మికుల మీద కేసులు పెట్టొద్దు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని రావణకాష్టంలా మారుస్తుందని ఆరోపించారు. అగ్నిపథ్ స్కీమ్ తెచ్చి దేశంలోని యువత పొట్టకొడుతున్నారని విమర్శించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని దేశద్రోహులని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అగ్నిపథ్‌ పథకం మంచిదని చెబుతున్నాడు. అగ్నిపథ్‌ పథకంలో చేరిన తర్వాత బట్టలు ఉతకొచ్చు. కటింగ్‌ చేయొచ్చు, ఎలక్ట్రిషియన్‌ పని చేయొచ్చు.. బ్రహ్మాండంగా ఉంటది భవిష్యత్‌ అంటున్నాడు. దాని కోసం కోసం దేశ యువత మిలటరీలో చేరాలా?’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. యువత రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే కేంద్రం అది పట్టించుకునే మూడ్‌లో లేదని విమర్శించారు. 

జన్‌ధన్‌ ఖాతాలు తెరువాలని రూ.15లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారని.. ఒక్కరికైనా రూ.15లక్షల వచ్చాయా అని ప్రశ్నించారు. 2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికీ నల్లాపెట్టి నీరు అందిస్తానని మోదీ అన్నారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొని.. ఇంటింటికీ నల్లానీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని, దానికి ఒకపైసా కూడా సాయం చేయలేదని ఆరోపించారు. నీతి ఆయోగ్‌ స్వయంగా రూ.19వేలకోట్ల సాయం చేయమని చెప్పినా 19 పైసలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.