ఆ విషయం మోడీకి, రాహుల్కు తెలుసు: కేటీఆర్ సంచలనం
2019 ఎన్నికల్లో కూడ తెలంగాణకు కేసీఆర్ సీఎం అవుతారని ప్రధాన మంత్రి మోడీకి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తెలుసునని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: 2019 ఎన్నికల్లో కూడ తెలంగాణకు కేసీఆర్ సీఎం అవుతారని ప్రధాన మంత్రి మోడీకి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి తెలుసునని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రగతి నివేదన సభ ప్రాంగంణం వద్ద మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఇవాళ కేబినేట్ సమావేశం ఉన్నప్పటికీ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ కేబినేట్ సమావేశానికి రాకుండా మినహాయింపు ఇచ్చారు.
2019 లో కూడ తెలంగాణలో టీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టనున్నారని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ విషయం మోడీ, రాహుల్కు కూడ తెలుసునని చెప్పారు.
ఎన్నికలను ఎదుర్కోవడానికి విపక్షాలు భయపడుతున్నాయని ఆయన చెప్పారు. నాలుగున్నర ఏళ్లుగా ప్రజలు టీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
వచ్చే ఐదేళ్లలో ఏం చేయనున్నామో ఈ సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ చెప్పారు. మరో సారి ప్రజలకుయ సేవ చేసే అవకాశం కల్పించాలని ఈ సభ నుండి ప్రజలను కోరుతామని ఆయన చెప్పారు.
ఎన్నికలంటే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకొందన్నారు. అందుకే అసత్యాలను ప్రచారం చేస్తోందని కేటీఆర్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో టీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తోందని ఆయన చెప్పారు.