ఎమ్మెల్యేలను కొనడం నీకంటే బాగా ఎవరికి తెలుసు: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి విమర్శలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడ ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేలను కొనడం నీకంటే ఎవరికి బాగా తెలుసునని కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కొత్తగా పదవులు పొందిన నేతలు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్:ఎమ్మెల్యేలను కొనడం నీకంటే బాగా ఎవరికి తెలుసునని తెలంగాణ మంత్రి కేటీఆర్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. గురువారం నాడు తెలంగాణ భవన్ లో తెలంగాణ సింగరేణి కోల్మైన్స్ బీఎంఎస్ నేత కెంగెర్ల మల్లయ్య తన అనుచరులతో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆయన చెప్పారు. సోనియా తెలుగు కాంగ్రెస్ కు ఆయన అధ్యక్షుడు అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు. సోనియా తల్లి కాదు బలిదేవత అని అన్నారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబును తెలంగాణ తండ్రి అని అని అంటాడని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ కు టీడీపీ పాత వాసనలు పోలేదన్నారు. టీపీసీసీ కాదు టీడీపీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టాలంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. నువ్వు పార్టీ మారావు కదా ఏ రాయితో కొట్టాలని కేటీఆర్ ప్రశ్నించారు. చిన్నపదవి రాగానే సీఎం పదవి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారన్నారు.
కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్ లా ఉంది రేవంత్ రెడ్డి తీరు అని ఆయన మండిపడ్డారు. చట్ట ప్రకారమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో విలీనమయ్యారని ఆయన గుర్తు చేశారు. అది టీపీసీసీ కాదు, తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
also read:మార్కెట్లోకి కొత్త బిచ్చగాళ్లు: షర్మిల, రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు
నిన్నమొన్న పదవులొచ్చిన కొత్త బిచ్చగాళ్లు కూడ కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి రేవంత్ ను విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక పోరాటాలు చేసిన ఘనత టీఆర్ఎస్దని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడ రేవంత్ రెడ్డిపై ఘాటుగానే రిప్లై ఇచ్చారు.