గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా పరిస్థితులు ఉన్న గతేడాది ఐటీ రంగంలో అంచనాలకు మించి రాణించినట్టుగా తెలిపారు.
గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీ రంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ చెప్పారు. కరోనా పరిస్థితులు ఉన్న గతేడాది ఐటీ రంగంలో అంచనాలకు మించి రాణించినట్టుగా తెలిపారు. 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట్రామిరెడ్డి, యూఎస్ కౌన్సిల్ జనరల్ జోయల్ రెఫ్మాన్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ జగన్మోహన్ రావు, వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఐటీ రంగంలో సాధించిన పురోగతి వివరించారు.
2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ. 1,83,569 కోట్లనీ కేటీఆర్ చెప్పారు. 2035 నాటికి దీనిని రూ 2.9 లక్షల కోట్లుకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది తెలంగాణ 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. గతేడాది దేశంలో 4.5లక్షల ఉద్యోగాలు వస్తే.. హైదరాబాద్లో లక్షన్నర వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉందని.. తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ఈ నెల 20న టీ హబ్ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రామగుండంలో ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు.
