కేసిఆర్ బీసిలకు దేవుడు
- బీసీలకు త్వరలో 100 ఎకరాల్లో బీసీ ఆత్మగౌరవ భవన్
- స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు
- విద్య, ఉద్యోగ, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు
- కేసీఆర్ కారణజన్ముడు
బిసిలకు కేసిఆర్ దేవుడుగా నిలిచాడని తెలంగాణ ఫారెస్టు, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న కొనియాడారు. కేసిఆర్ కారణజన్ముడంటూ ప్రశంసల వరద పారించారు. ఎస్సీ,ఎస్టీల తరహాలో బీసీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ కమిటీలో మొదటి అంశంగా చేర్చినట్లు జోగు రామన్న తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ మధుసూదన చారి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన సమావేశం అనంతరం మంత్రి జోగు రామన్న సచివాలయంలో రాత్రి ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్తో కలిసి విలేకరుల సమావేశంలోమాట్లాడారు. బీసీల జనాభా సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
బీసీ స్కిల్స్ను మరింత పదును పెట్టేందుకు 100 ఎకరాల్లో ఫూలే పేరిట బీసీ ఆత్మగౌరవ భవన్ను ఏర్పాటు చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం, ఎలెక్టెడ్, సెలెక్టెడ్ పోస్టుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. విద్య, ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. 31 జిల్లాల్లో రెండేసీ చొప్పున 62 డిగ్రీ, 62 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ కమిటీ ప్రతిపాదించిందన్నారు. కొత్తగా మరో 119 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు.
31 జిల్లాల్లో నిరంతరంగా కోచింగ్ సెంటర్లు కొనసాగుతాయని, బీసీలకు కాంట్రాక్ట్ పనుల్లో రూ.కోటి వరకు ఈఎండీలో మినహాయింపు ఇవ్వాలని, పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ర్యాంకులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఫీ రీఎంబర్మెంట్ కల్పించాలని, బీసీ ఎండోమెంట్ పాలసీని ఏర్పాటు చేయాలని, కులాంతర వివాహం చేసుకున్న వారికి ప్రోత్సాహకాన్ని పెంచాలని, బీసీ న్యాయవాదులకు స్టయిఫండ్ పెంచాలని, సంచార జాతులకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించాలని, సబ్సిడీని ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అందజేయాలని ప్రతిపాదించనున్నట్లు జోగు రామన్న తెలిపారు. బీసీల దేవుడు.. సీఎం కేసీఆర్ అని ఆయన అభివర్ణించారు.
ఎమ్మెల్యే వీ. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కారణజన్ముడు సీఎం కేసీఆర్ అని అన్నారు. బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లెందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. బీసీలు ఆత్మగౌవరంతో బతుకుతారని అన్నారు.