బాసరలో వసంత పంచమి వేడుకలు: పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బాసర అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో చిన్నారులకు అక్షరాభాస్యం కొరకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు.
ఆదిలాబాద్: జిల్లాలోని బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గురువారం నాడు తెల్లవారుజాము నుండి బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో తెల్లవారుజామున రెండు గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో చిన్నారులకు అక్షరాభాస్యాన్ని ప్రారంభించారు.
సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంత పంచమి సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిక దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
రాష్ట్ర ప్రజలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు. బాసర దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు