కోదండరామ్ వాడిన ఆ కారు ఎవరిది: హరీష్రావు
కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అధికారం కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు.
హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుపడుతున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అధికారం కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు.
మంగళవారం నాడు హైద్రాబాద్లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేస్తే శాశ్వతంగా రాష్ట్రంలో అధికారానికి దూరమౌతామని ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు తప్పుడు కేసులను వేస్తున్నారని ఆయన చెప్పారు.
తప్పుడు కేసులతో భూసేకరణను అడ్డుకొంటున్నారని కాంగ్రెస్ నేతలపై హరీష్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదులు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దిగువన ఉన్న ఏపీ రాష్ట్రానికి భవిష్యత్తులో గోదావరి జలాలు రావనే భయంతో ఈ ప్రాజెక్టుపై చంద్రబాబునాయుడు కేంద్రానికి ఫిర్యాదులు చేశారని చెప్పారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకు ఫిర్యాదులు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మధ్య ఏం తేడా ఉందని ఆయన ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత ఈ అనుమతులను కూడ రద్దు చేయాలని కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.
భూ సేకరణను కూడ అడ్డుకొంటున్నారని ఆయన చెప్పారు. జేఎసీ ఛైర్మెన్ గా ఉన్న కోదండరామ్ మెదక్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూసేకరణను అడ్డుకొనేందుకు వెళ్లాడని చెప్పారు. గ్రామాల్లో పర్యటించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద రిజర్వాయర్ల నిర్మాణం కోసం అవసరమైన భూమిని ఇవ్వకూడదని గ్రామాల్లో పర్యటించి ప్రజలను కోరారు. ఆ సమయంలో మాజీ డీప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పేరుతో రిజిస్టరైన కారులో పర్యటించారని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు భూసేకరణ విషయంలో కూడ చనిపోయిన వారితో కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు కోర్టుల్లో తప్పుడు కేసులు వేయించారని హరీష్ రావు చెప్పారు. మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి తన అకౌంట్ నుండి కోర్టు కేసులు దాఖలు చేసిన ఆర్థికసహయం చేశారని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత కాలం పట్టిందో మంత్రి హరీష్ రావు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన ప్రయత్నాలు చేసిందనే విషయాలను అసెంబ్లీ వేదికగా అన్ని రకాల ఆధారాలతో బయటపెడతామని హరీష్ రావు హెచ్చరించారు.