తప్పుడు ప్రచారంతో దుబ్బాకలో లబ్దికి ప్రయత్నం: బీజేపీ నేతలపై హరీష్ రావు ఫైర్
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన దుబ్బాకలో మీడియాతో మాట్లాడారు. బిజెపి నాయకులు తమ వైఖరితో భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేశారన్నారు.
దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ నేతలు తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన దుబ్బాకలో మీడియాతో మాట్లాడారు. బిజెపి నాయకులు తమ వైఖరితో భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేశారన్నారు.
పూటకో పుకారు పుట్టిస్తారు గంటకో అబద్ధం ఆడేస్తారు ఇదీ బిజీపి నాయకుల నైజమని ఆయన విమర్శించారు. వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని సామెత. కానీ బి జె పి మాత్రం దుబ్బాకలో వెయ్యి అబద్దాలాడైనా ఒక ఎన్నిక గెలవాలె అనే కొత్త సామెతను సృష్టిస్తుందన్నారు.
ఉపఎన్నిక ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచి ఒక్క బిజెపి నాయకుడు నిజం మాట్లాడటం లేదని ఆయన చెప్పారు. అబద్ధాలే పునాదిగా బి జె పి తప్పుడు ప్రచారాలకు తెరతీసిందని చెప్పారు.
బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 2016 పెన్షన్ లో కేంద్రం రూ. 1600 ఇస్తోందని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
నిజాలు నిగ్గు తేల్చాలని తాను సవాలు విసిరితే తోక ముడిచారని మంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా వాటికి కేంద్రం నుండి నిధులు ఇస్తున్నామని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. తెలంగాణకు ఉపయోగపడే ఏ ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చారా అని ఆయన ప్రశ్నించారు.నిజామాబాద్ లో గెలిపిస్తే పసుపు బోర్డును ఎందుకు తేలేదో చెప్పాల్సిందిగా ఆయన కోరారు.