సారాంశం

సదాశివపేట తహసీల్దార్  కార్యాలయాన్ని  తెలంగాణ మంత్రి హరీష్ రావు  ఆకస్మికంగా  తనిఖీ  చేశారు. 

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని  సదాశివపేట  తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారంనాడు  మంత్రి  హరీష్ రావు  ఆకస్మికంగా తనిఖీ చేశారు.తహసీల్దార్  కార్యాలయంలో  ధరణి పోర్టల్ విషయమై మంత్రి హరీష్ రావు  రైతులను అడిగి తెలుసుకున్నారు.  

ధరణి పోర్టల్ కారణంగా  రైతులకు మేలు  జరిగిందని  మంత్రితో  రైతులు  చెప్పారు.ధరణి తెచ్చి తమకు  ప్రయోజనం చేకూర్చారని రైతులు  అభిప్రాయపడ్డారు. ధరణి రాకముందు   పేరు మార్పిడి కోసం , ఇతర పనుల  కోసం  అధికారులచుట్టూ తిరగాల్సి వచ్చేదని రైతులు  గుర్తు చేసుకున్నారు. 

భూములు  విక్రయిస్తే  అధికారులు, దళారులకు   డబ్బులిస్తేనే   రిజిస్ట్రేషన్ , మ్యుటేషన్  అయ్యేదని  రైతులు  మంత్రికి  చెప్పారు.ధరణి పోర్టల్ తో  ఇప్పుడు  ఆ పరిస్థితి లేదన్నారు. అయితే  ఒకరిద్దరూ  ధరణితో  ఇబ్బందులున్న విషయాన్ని  మంత్రి హరీష్ రావు దృష్టికి తెచ్చారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  వెంటనే  ధరణిని రద్దు చేస్తామని  కాంగ్రెస్  పార్టీ  ప్రకటించింది. ధరణిని  రద్దు చేస్తామన్నవారిని  రద్దు  చేయాలని  కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి  కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలకు  కాంగ్రెస్ నేతలు అంతే స్థాయిలో  కౌంటర్లు ఇస్తున్నారు.