మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను త్యాగం చేసిన మొదటి అమరుడు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి గత పదిరోజులుగా కనిపించడం లేదంటూ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది.
హైదరాబాద్: తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి (Kasoju Srikanth Chary) తండ్రి వెంకటాచారి (55) పది రోజులుగా కనిపించడం లేదంటూ హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. తన భర్త ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో కలిసి మీడియాతో మాట్లాడిన తర్వాత కనిపించకుండా పోయారంటూ టీఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ ఆరోపించారు. తన భర్త ఆఛూకీ కనుగొనాలంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసారు.
హయత్ నగర్ సూర్యనగర్ కాలనీలోని రోడ్ నంబర్ 8 లో వెంకటాచారి-శంకరమ్మ దంపతులు కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. అయితే ఈ నెల (జూన్) 1వ తేదీన మధ్యాహ్నం పని వుందంటూ వెంకటాచారి ఇంట్లోంచి బయటకు వెళ్లాడని... ఆ తర్వాత తిరిగి ఇంటికి చేరుకోలేదని శంకరమ్మ తెలిపారు. అయితే తర్వాతి రోజు కేఏ పాల్ తో కలిసి మిడియా ముందుకు వచ్చారన్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదని శంకరమ్మ అన్నారు.
తన భర్త ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వద్దే వున్నాడని అనుమానం వుందని శంకరమ్మ పేర్కొన్నారు. పది రోజులుగా భర్త కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని... వెంటనే చర్యలు తీసుకుని భర్తను ఇంటికి చేర్చాలని శంకరమ్మ పోలీసులను కోరారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక ఇటీవల కేఏ పాల్ తనను కూడా కిడ్నాప్ చేయించడానికి ప్రయత్నించారని శంకరమ్మ ఆరోపించారు. కొందరికి రూ.20లక్షలు ఇచ్చి తనను కిడ్నాప్ చేయాలని పాల్ డీల్ కుదుర్చుకున్నట్లు... వీరి తన కిడ్నాప్ కు ప్రయత్నాలు కూడా చేసినట్లు శంకరమ్మ సంచలన ఆరోపణలు చేసారు.
తన భర్త వెంకటాచారిని కేఏ పాల్ ఇంట్లో బంధించాడని శంకరమ్మ పేర్కొన్నారు. ఇది తెలిసి కేఏ పాల్ ఇంటికి వెళ్ళి దయచేసి భర్తను వదిలిపెట్టాలని కోరినట్లు తెలిపారు. తనపై కనికరం చూపకుండా బౌన్లర్లతో గెలించారని శంకరమ్మ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసారు.
తన భర్త వెంకటాచారికి మాయమాటలు చెప్పి విడాకులు ఇప్పించాలని కేఏ పాల్ చూస్తున్నాడని శంకరమ్మ తెలిపారు. మీ ఇంటికి విడాకుల నోటీసులు పంపించాడు... అందలేదా అంటూ కేఏ పాల్ అనుచరులు అడుగుతున్నారని పేర్కొన్నారు. అమరువీరుడు శ్రీకాంత్చారి పేరు చెప్పుకుని రాజకీయం చేయాలని పాల్ చూస్తున్నాడని... అందుకు అడ్డు చెబుతున్నానని తనపై కక్షగట్టాడని అన్నారు. ఈ క్రమంలోనే కుట్రలతో తనకు భర్తను దూరం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. కేఏ పాల్ తో తన కుటుంబానికి ప్రాణహాని వుందని శంకరమ్మ ఆందోళన వ్యక్తం చేసారు.
ఇదిలావుంటే ఇటీవల శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి తో కలిసి కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. ప్రజాశాంతి తరపున మొదటి ఎమ్మెల్యే టికెట్ వెంకటాచారికే ప్రకటిస్తున్నట్లు పాల్ వెల్లడించారు. వెంకటాచారి కూడా పాల్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న శంకరమ్మ ఎల్బీ నగర్ వద్ద కేఏ పాల్ ప్లెక్సీని కాల్చివేస్తూ నిరసన తెలిపారు. తన భర్తకు మాయమాటలు చెప్పి కేఏ పాల్ ఇష్టంవచ్చినట్లు మాట్లాడిస్తున్నారని శంకరమ్మ ఆగ్రహం వ్యక్తం చేసారు.