తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెద్ద షాకిచ్చింది. ఇక నుంచి డిగ్రీ విద్యార్థులకు 75 శాతం హాజరు ఉన్నవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యలో వెనకబడకుండా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక మార్పులు చేసింది. ఇకపై డిగ్రీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత పొందాలంటే, వారికొరకు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా 75 శాతం హాజరు లేకపోతే, ఇక ఆ విద్యార్థులకు ప్రభుత్వ సాయాన్ని నిలిపివేస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది.
గతంలో ప్రభుత్వం 75 శాతం హాజరు ఉండాలి అనే ఆదేశాలు ఇచ్చినప్పటికీ, చాలా కాలేజీల్లో దీనిని సరైన విధంగా అమలు చేయలేదన్న అభిప్రాయంతో తాజాగా దీనిపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఇటీవల జరిగిన వైస్ ఛాన్సిలర్ల సమావేశంలో కొత్త మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఈ సమావేశానికి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ నియమాలను కఠినంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఆన్లైన్లో హాజరు నమోదుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. తద్వారా విద్యార్థులు తరగతులకు తరచూ హాజరు కావడంతో విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.
అంతేకాక, ఈ సమావేశంలో డిగ్రీ కోర్సుకు సంబంధించిన క్రెడిట్ వ్యవస్థలోనూ మార్పులు చేశారు. ఇప్పటివరకు మూడేళ్ల డిగ్రీలో 150 క్రెడిట్లు ఉండగా, ఇప్పుడు వాటిని 142కు తగ్గించాలని నిర్ణయించారు. ఈ మార్పులు కొత్త విద్యాసంవత్సరం నుంచే అమలులోకి రానున్నాయి.ఇక డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసిన విద్యార్థులకు మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. సీటు రాని వారికి లేదా కేటాయించిన కాలేజీ నచ్చనివారికి మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వనున్నారు.
ఇతర అన్ని విషయాల్లో ప్రస్తుత విధానం కొనసాగినప్పటికీ, హాజరు ప్రమాణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం విద్యార్థులపై ప్రభావం చూపనుంది. కళాశాలలు, విద్యార్థులు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.