Asianet News TeluguAsianet News Telugu

రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదు జమ.. ఒకసారి అకౌంట్ చెక్ చేసుకోండి

ఎప్పుడెప్పుడా అని అన్నదాతలు ఎదురుచూస్తున్న రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతగా రూ.లక్ష రూపాయల రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు.

Telangana Loan Waiver: CM Revanth Reddy Launches Crucial Initiative GVR
Author
First Published Jul 18, 2024, 6:35 PM IST | Last Updated Jul 18, 2024, 6:35 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీ అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎప్పుడెప్పుడా అని అన్నదాతలు ఎదురుచూస్తున్న రుణమాఫీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతగా రూ.లక్ష రూపాయల రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ నుంచి రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన సీఎం... రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది రైతులకు తొలి విడత రుణమాఫీ వర్తింపజేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.6వేల 98కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. 

ఈ సందర్భంగా తొలి విడత రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖాముఖిగా మాట్లాడారు. రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు తమకిచ్చారన్నారు. మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి నిరూపణ అయిందన్నారు. నాడు కరీంనగర్‌లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసని మాట ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారని విమర్శించారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ.16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ.12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రెండోసారి ప్రభుత్వంలో రూ.12 వేల కోట్లని కేవలం రూ.9 వేల కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. రూ.పదేళ్లలో రూ.21 వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీకి కేసీఆర్ చెల్లించలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదని విమర్శించారు. 

‘‘2022 మే 6న వరంగల్‌లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. 2023 సెప్టెంబర్ 17న తుక్కుగూడాలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు. రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారు. సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు రూ.6,098 కోట్ల రూపాయలను రుణమాఫీ ఖాతాల్లో జమ చేస్తున్నాం. రుణమాఫీకి సహకరించిన మంత్రులు, అధికారులకు రైతాంగం తరుపున ధన్యవాదాలు చెప్తున్న. నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మరుపురాని రోజు ఇది. రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది. కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు రుణమాఫీ కటాఫ్ గా పెట్టాం. ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం. రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతులకు రుణ విముక్తి కల్పించాం. రూ.లక్ష నుంచి లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుంది. ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతాం.’’ సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. 

‘‘కొంత మంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహ సృష్టిస్తున్నారు. రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు. రుణమాఫీకి పాస్ బుక్ నే కొలబద్ద తప్ప రేషన్ కార్డు కాదు. దొంగలు చెప్పే దొంగ మాటలను నమ్మొద్దు. ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం. సమస్యలు తలెత్తితే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి. బ్యాంకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. వ్యవసాయ శాఖ అధికారులు రైతు రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు చేయాలి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతు... ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది. సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వం అప్పులకు మిత్తిగా ప్రతి నెలా రూ.ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నాం. రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది. ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం. సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం. ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తు పెట్టుకోవాలి’’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ధన్యవాదాలు తెలుపుతు తీర్మానం చేశారు. రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్ గాంధీని ఆహ్వానించి వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పారు. 


కాగా, రూ.1లక్ష వరకు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో ఆర్థిక శాఖ నగదు జమ చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతల చిత్రపటాలకు రైతులు, రైతు సంఘాల నాయకులు క్షీరాభిషేకాలు చేశారు. జిల్లాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయుల్లో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన రైతు రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios