జగదీష్ రెడ్డితో విభేదాల్లేవు, మా అబ్బాయి పోటీ కేసీఆర్ చేతుల్లోనే.. కోమటిరెడ్డి నోటికి అడ్డూ అదుపూ లేదు : గుత్త
మంత్రి జగదీష్ రెడ్డికి , తనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తన తనయుడు అమిత్కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

మంత్రి జగదీష్ రెడ్డికి , తనకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవన్నారు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా అధికారిక వ్యవహారాల్లో తాను ఎన్నడూ జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. ఎవరైనా నా వద్దకు వచ్చినా నిబంధనల ప్రకారం వెళ్లాలని చెబుతానని గుత్తా అన్నారు. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు. తన తనయుడు అమిత్కు టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అవకాశం ఇస్తేనే అమిత్ పోటీ చేస్తారని.. టికెట్ కోసం పైరవీలు , ప్రాకులాడటం వంటివి చేయనని గుత్తా అన్నారు.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని.. కొంతమంది విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తాను భాష ప్రయోగం విషయంలో హుందాగా ఉంటానని గుత్తా తెలిపారు. బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదని సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. సొంత పార్టీలో అవిశ్వాసాలు మంచి సంప్రదాయం కాదని ఆయన హితవు పలికారు. వామపక్షాలతో సీట్లు పొత్తు ఖరారు అయ్యాకనే ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మార్పుపై క్లారిటీ వస్తుందని గుత్తా తెలిపారు.
Also Read: స్ట్రాటజీ రోడ్ మ్యాప్తో ఎన్నికలకు వెళ్తాం: కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్
వామపక్షాలు బీఆర్ఎస్తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయని.. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ పనిచేసినా రాజకీయ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు ఆత్మవిమర్శ అనేది ఉండాలి ఆయన హితవు పలికారు. నేను చేసేదే కరెక్ట్.. తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటే బొక్క బోర్లా పడటం ఖాయమని గుత్తా హెచ్చరించారు. తాము చేసే పనులను జనం మెచ్ఛుతున్నారా ? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించాలని సుఖేందర్ రెడ్డి హితవు పలికారు.