కోకాపేట, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూముల విక్రయం ప్రక్రియను నిలుపుదల చేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు బీజేపీ నేత విజయశాంతి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

బీజేపీ నేత విజయశాంతికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భూముల వేలాన్ని నిలుపుదల చేయాలంటూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించిన జీవో నెం 13ను కొట్టివేయాలని విజయశాంతి పిటిషన్‌లో కోరారు. దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది.

Also Read:ప్రభుత్వ భూముల అమ్మకం: వేలం ప్రక్రియపై హైకోర్టులో విజయశాంతి పిటిషన్

ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. నిధుల సమీకరణతో పాటు భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదమున్నందున ప్రభుత్వ భూములు వేలం వేస్తున్నామని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు.. భూములను ప్రభుత్వమే కాపాడుకోలేక అమ్ముకోవడం ఏంటని ప్రశ్నించింది. జిల్లాల్లో వెయ్యి ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుపై పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.