బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌‌ ఎత్తివేతపై నిర్ణయాధికారం శాసనసభ స్పీకర్‌దేనని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు రేపటి అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని.. శాసనసభ కార్యదర్శిని న్యాయస్థానం ఆదేశించింది.  

బీజేపీ (bjp) ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై (mlas suspension) తెలంగాణ హైకోర్టు (telangana high court) కీలక వ్యాఖ్యలు చేసింది. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ (telangana assembly speaker) ముందుకు తీసుకెళ్లాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. స్పీకర్ వాళ్ల అభ్యర్ధను వినేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది హైకోర్టు. సస్పెన్షన్‌పై స్పీకర్‌దే తుది నిర్ణయమని... రేపు ఉదయం స్పీకర్ వద్దకు వెళ్లాలని న్యాయస్థానం బీజేపీ ఎమ్మెల్యేలకు సూచించింది. స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సభలో ప్రజాప్రతినిధులు వుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయస్థానాలు కలగజేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. అసెంబ్లీ చివరి రోజైన రేపు సభకు అనుమతించాలని ఆయన కోరారు. కోర్టు సూచనను గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా.. సస్పెన్షన్‌పై హైకోర్టు‌లో బీజేపీ ఎమ్మెల్యేలు అప్పీలు చేసిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ ఉజన్ బయల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోకపోవడంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని జ్యూడిషీయల్‌ రిజిస్ట్రార్‌ను హైకోర్టును ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు చేరేలా చూడాలని.. రిజిస్ట్రార్ జనరల్, హైదరాబాద్‌ సీపీ స్వయంగా వెళ్లి నోటీసులు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది. 

బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్నారనే కారణంతో ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. స్పీకర్‌ జారీచేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేసి సమావేశాలకు తమను అనుమతించేలా ఆదేశించాని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. అసెంబ్లీ స్పీకర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. 

శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలను లేదన్న అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి షమీమ్‌‌ అక్తర్‌ ఏకీభవించారు. సభా కార్యక్రమాలకు మెంబర్‌‌ ఎవరైనా ఆటంకం కల్పిస్తే సస్పెండ్‌‌ చేసే అధికారం స్పీకర్‌‌కు ఉందన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి, సెక్రటేరియట్‌ కార్యదర్శికి నోటీసులిచ్చేందుకు హైకోర్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ స్వయంగా వెళ్లినా అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించలేదని రిజిస్ట్రా ర్‌ (జ్యుడీషియల్‌) న్యాయమూర్తికి నివేదిక సమర్పించారు.