వ్యాక్సిన్ తీసుకున్న లాయర్లకే కోర్టుల్లోకి అనుమతి: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బంది కరోనా నియామవళి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది.
కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. న్యాయవాదులు, ఇతర న్యాయ సిబ్బంది కరోనా నియామవళి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని కోర్టులు, ట్రైబ్యునళ్లకు తెలంగాణ హైకోర్టు శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆగస్టు 9 నుంచి పలు కేసుల ప్రత్యక్ష విచారణ చేపడుతున్నట్టు కోర్టు ఆదేశాల్లో వెల్లడించింది. అయితే ఇది పాక్షికమేనని, సెప్టెంబరు 9 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. అది కూడా రోజుకొక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్కు ప్రత్యక్ష విచారణ అవకాశం కల్పిస్తామని హైకోర్టు పేర్కొంది. ఆగస్టు 8 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కోర్టుల్లో ఆన్ లైన్ లో విచారణ ఉంటుందని న్యాయస్థానం వివరించింది