ఫామ్హౌస్లో ముందే కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు పెట్టారా : ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై హైకోర్ట్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫామ్హౌస్లో ముందే కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థ పెట్టారా అని ప్రశ్నించింది. ప్రతి కేసులో 41ఏ సీఆర్పీసీ ఇచ్చి అరెస్ట్ చేయాలన్న నిబంధన లేదన్నారు ఏజీ. నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని హైకోర్ట్ ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదే సమయంలో మెయినాబాద్ ఫామ్హస్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసుగా నమోదు చేశారు. 4 రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లను వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో వాయిస్ రికార్డుర్లు పెట్టామని.. ఫామ్హౌస్లో మధ్యాహ్నం 3.05 గంటలకు రహస్య కెమెరాలు ఆన్ చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సాయంత్రం 4.10 గంటలకు గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు వచ్చారని... మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారని పోలీసులు తెలిపారు. మీటింగ్ పూర్తవ్వగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని.... సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పామని పోలీసులు పేర్కొన్నారు. కొబ్బరి నీళ్లు తీసుకురా అనగానే హాల్ లోపలికి వెళ్లామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామంటూ సంభాషణ జరిగిందని.. ఇది వాయిస్ రికార్డర్లలో నమోదైందని పోలీసులు తెలిపారు.
మరోవైపు.. మొయినాబాద్ ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల ప్రలోభాలకు తమకు సంబంధం లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ శుక్రవారం నాడు ప్రమాణం చేశారు. ఇవాళ ఉదయం మర్రిగూడ నుండి బండి సంజయ్ యాదాద్రి ఆలయానికి బయలు దేరారు. మధ్యాహ్నానికి యాదాద్రికి చేరుకున్నారు.
ALso REad:ఎవరెవరికి ఎంతివ్వాలి: రామచంద్రభారతి, నందకుమార్ ,సింహయాజీల ఫోన్ సంభాషణ
సీఎం కేసీఆర్ ను కూడ ప్రమాణం చేసేందుకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. అయితే ఈ అంశానికి సంబంధించి టీఆర్ఎస్ నుండి ఎలాంటి స్పందన రాని విషయాన్ని కూడా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. యాదాద్రికి చేరుకున్న బండి సంజయ్ స్నానం చేసి తడిబట్టలతో ఆలయంలో మూల విరాట్టును దర్శించుకున్నారు. అక్కడి నుండి నేరుగా స్వామివారి పాదాల వద్ద ప్రమాణం చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురిచేశామని తమపై టీఆర్ఎస్ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది.
ఇకపోతే.. ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశానికి సంబంధించి రామచంద్ర భారతి పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య జరిగిన ఆడియో సంభాషణను ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ శుక్రవారం నాడు ప్రసారం చేసింది. ఈ నెల 26న ఫాంహౌస్ మీటింగ్కు ముందే ఈ సంభాషణ జరిగిందని ఆ కథనంలో పేర్కొంది. ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని రామచంద్రభారతి కోరినట్లుగా ఆడియో సంభాషణలో ఉంది. తన వద్ద నందకుమార్ ఈ అంశం ప్రతిపాదించినట్టుగా చెప్పారు. సమావేశానికి హైద్రాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిఘా ఉందని రోహిత్ రెడ్డి రామచంద్రభారతికి చెప్పారు. తనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని రోహిత్ రెడ్డి రామచంద్రభారతితో అన్నట్టుగా ఆడియోలో ఉంది.