ఓసీఐ అప్లికేషన్లో జర్మనీ పౌరుడిగా ఎందుకు చెప్పారు: చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై వివాదం హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొంటే ఓసీఐ ధరఖాస్తులో జర్మనీ పౌరుడిగా ఎలా పేర్కొన్నారని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొంటే ఓసీఐ ధరఖాస్తులో జర్మనీ పౌరుడిగా ఎలా పేర్కొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని గతంలో ఆది శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది.
ఇవాళ జరిగిన విచారణలో కేంద్రం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు తరపున అడ్వకేట్ రామారావు వాదించారు. ఆది శ్రీనివాస్ తరుపున రవికిరణ్ వాదనలు విన్పించారు.చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని ఎఎస్జీ రాజేశ్వరరావు మరోసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓసీఐ ధరఖాస్తులోనూ జర్మనీ పౌరుడుగా ప్రస్తావించారని జర్మనీ పాస్ పోర్టును 2023 వరకు పునరుద్దరించుకొన్నారని న్యాయవాది రవికిరణ్ వాదించారు.
మరో వైపు చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొన్నారని ఆయన తరపు న్యాయవాది రామారావు వాదించారు. జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొంటే ఓసీఐ ధరఖాస్తులో జర్మనీ పౌరుడిగా ఎలా పేర్కొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకొని చెబుతామని న్యాయస్థానానికి రమేష్ తరపు న్యాయవాది చెప్పారు. ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది హైకోర్టు.