TS High Court : రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు.. కరోనా పరిస్థితులపై హైకోర్టు కీలక ఆదేశాలు
TS High Court : తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని తెలిపింది.
TS High Court : తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై సోమవారం మరోసారి హైకోర్టులో విచారణ చేపట్టింది. ఈనెల 12 వరకు తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ రిపోర్టు ఆధారంగా హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ కానున్నట్టు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రోజుకు కనీసం లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్న ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా నివేదించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా నియమ నిబందనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. అలాగే.. భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు.
రోజురోజుకు కరోనా వ్యాప్తి వేగం వంతం అవుతున్న తరుణంలో నియంత్రణ చర్యలను కఠినతరంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్రమత్తత అవసరమన్న హైకోర్టు కరోనా నియంత్రణపై ఇవాళ మంత్రివర్గం చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించారు. సమావేశ పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులపై విచారణ ఈనెల 25కు వాయిదా వేసినట్టు హైకోర్టు తెలిపింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో హైకోర్టులో రేపట్నుంచి వర్చువల్గా కేసుల విచారణ చేపట్టనున్నది. ఆన్లైన్లోనే పూర్తిస్థాయి విచారణలు చేపట్టనున్న హైకోర్టు తెలిపింది. కొవిడ్ వ్యాప్తి వల్ల మళ్లీ వర్చువల్ విచారణలు జరపనున్నది హైకోర్టు.