తెలంగాణలో పదో తరగతి హిందీ పేపర్‌ లీక్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్ధికి హైకోర్టు శుభవార్త చెప్పింది. అతని డిబార్‌ను ఎత్తేసిన న్యాయస్థానం , పరీక్షలు రాసేందుకు అనుమతించింది.   

తెలంగాణలో పదో తరగతి పరీక్షల సందర్భంగా హిందీ పేపర్ లీకైన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు మూల కారణమైన వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్ధిని విద్యాశాఖ అధికారులు ఐదేళ్లు పాటు డిబార్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్ధికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతనిపై డిబార్‌ను ఎత్తివేసిన న్యాయస్థానం.. విద్యార్ధిని సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

కాగా.. తెలంగాణ పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేయగా.. గురువారం రాత్రి ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ కేసుకు సంబంధించి కమలాపూర్ గురుకుల పాఠశాల విద్యార్ధిని ఐదేళ్ల పాటు డిబార్ చేయడాన్ని ఖండించారు.

Also Read: టెన్త్ పేపర్ లీక్ కేసు .. ఆ విద్యార్ధిని డిబార్ చేయొద్దు : ప్రభుత్వానికి బండి సంజయ్ విజ్ఞప్తి

అన్ని పరీక్షలు బాగా రాసిన విద్యార్ధిని డిబార్ చేయడం తగదని.. బెదిరించి తన వద్ద పేపర్ లాక్కున్నాడని ఆ విద్యార్ధి చెబుతున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇంత జరుగుతుంటే పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ కక్షతో విద్యార్ధి జీవితాన్ని నాశనం చేయడం తగదని.. డిబార్‌ను ఉపసంహరించుకుని అతనితో పరీక్షలు రాయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

మరోవైపు బాధిత విద్యార్ధి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయడానికి వెళితే డీఈవో పిలిచి మందలించారని వాపోయాడు. హాల్ టికెట్ తీసుకుని ఓ పత్రంపై సంతకం చేయించుకున్నారని చెప్పాడు. ఆ రోజున పరీక్ష రాస్తుంటే ఓ బాలుడు ప్రశ్నాపత్రం ఇవ్వాలని తనను బెదిరించాడని.. తాను ఇవ్వనని అన్నానని, దీంతో అతను పేపర్ లాక్కొని మొబైల్‌తో ఫోటోలు తీసుకున్నాడని చెప్పాడు.