నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ సహా పలువురు విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కానుంది. 

తెలంగాణలో ఇంటర్ విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రైవేట్ ఇంటర్ కాలేజీల యాజమాన్యాలతో రేపు హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కీలక సమావేశం నిర్వహించనుంది. 

ఇదిలావుండగా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నార్సింగ్ శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. తన మరణానికి కారణమంటూ సాత్విక్ సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన లెక్చరర్ ఆచార్య, వార్డెన్ నరేష్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరు నలుగురిని రాజేంద్రనగర్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు నార్సింగి పోలీసులు. వారి వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. వారిని వదలొద్దని సాత్విక్ సూసైడ్ నోట్‌లో కోరాడు.

ALso REad: సాత్విక్ ఆడ్మిషన్ మరో కాలేజీలో ఉన్న విషయం తెలియదు: పేరేంట్స్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాజప్రసాద్, అలివేలు దంపతు చిన్న కుమారుడు సాత్విక్.. నార్సింగ్ శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం కాలేజ్ హాస్టల్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాత్విక్ ఆత్మహత్య చేసుకోవడానికి.. కాలేజ్ లెక్చరర్లు వేధింపులే కారణమని సాత్విక్ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు చెబుతున్నారు. మార్కులు తక్కువగా వస్తున్నాయని లెక్చరర్లు వేధించినట్టుగా సాత్విక్ తమతో చెప్పుకుని బాధపడినట్టుగా అతడి తల్లిదండ్రులు తెలిపారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే సాత్విక్ కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 

ALso Read: నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో వేధింపులు నిజమే: సాత్విక్ ఘటనలో ప్రభుత్వానికి నివేదిక

అంతకుముందు గురువారం సాత్విక్ ఆత్మహత్య ఘటనపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా విచారణ చేపట్టింది. డీఈవో ఆధ్వర్యంలో అధికారులు నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌ను సందర్శించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా అధికారులు సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీ చైతన్య యాజమాన్యానికి ఇంటర్ బోర్డు నోటీసులు జారీచేసింది. దీనిపై శ్రీ చైతన్య యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు రిపోర్టును సిద్దం చేసి ఇంటర్ బోర్డు కమిషనర్‌కు అందజేయనున్నారు.